దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!

- August 26, 2026 , by Maagulf
దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!

దుబాయ్: ప్రపంచంలోని అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (DXB)లో ప్రయాణికుల అనుభవాన్ని మరింత సులభతరం చేసేందుకు కొత్త సాంకేతిక మార్పులు చేపట్టనున్నారు. తక్కువ క్యూలు, తక్కువ డాక్యుమెంట్లు, వేగవంతమైన ప్రక్రియలే లక్ష్యంగా పలు అప్‌గ్రేడ్లను అమలు చేయనున్నారు.

DXBలో ఇప్పటికే చెక్-ఇన్, ఇమ్మిగ్రేషన్, లాంజ్ ప్రవేశం, బోర్డింగ్ వంటి పలు దశల్లో బయోమెట్రిక్ సాంకేతికత అందుబాటులో ఉంది. స్మార్ట్ గేట్ల ద్వారా అర్హత ఉన్న ప్రయాణికులు కెమెరా వైపు చూడటం ద్వారా పాస్‌పోర్ట్ కంట్రోల్‌ను పూర్తి చేసుకోవచ్చు.

ఎమిరేట్స్ టెర్మినల్-3లో 200కు పైగా బయోమెట్రిక్ కెమెరాల కోసం Dh85 మిలియన్లు పెట్టుబడి పెట్టింది. DXBలోని కొత్త AI ఆధారిత ‘రెడ్ కార్పెట్’ ఇమ్మిగ్రేషన్ కారిడార్ ఒకేసారి 10 మంది ప్రయాణికులను ప్రాసెస్ చేయగలదు. ప్రయాణికులు కొన్ని సందర్భాల్లో కేవలం ఆరు సెకన్లలోనే పాస్‌పోర్ట్ కంట్రోల్ పూర్తి చేసుకునే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ డాక్యుమెంట్-లైట్, టచ్‌లెస్ ప్రయాణ విధానాన్ని మరింత విస్తరించనున్నారు.

మరిన్ని సెల్ఫ్ సర్వీస్ సదుపాయాలు

విమానాశ్రయంలో సెల్ఫ్ సర్వీస్ సదుపాయాలను కూడా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రయాణికులు సిబ్బంది సహాయం లేకుండానే చెక్-ఇన్, బోర్డింగ్ పాస్ పొందడం, బ్యాగేజీ ట్యాగ్‌లను ప్రింట్ చేసుకోవడం, బ్యాగేజీని డ్రాప్ చేయడం వంటి సేవలను వినియోగించుకోవచ్చు. కొత్తగా ఎలాంటి సదుపాయాలను చేర్చనున్నారనే వివరాలను దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ విస్తరణతో సాంప్రదాయ చెక్-ఇన్ కౌంటర్ల వద్ద క్యూలు, వేచి ఉండే సమయం తగ్గే అవకాశం ఉంది.

రిమోట్ డిపార్చర్లకు కొత్త విధానం

టెర్మినల్‌కు నేరుగా ఏరోబ్రిడ్జ్ ద్వారా అనుసంధానం కాని రిమోట్ పార్కింగ్ ప్రాంతాల్లో నిలిపిన విమానాల్లో ప్రయాణించే వారికి ‘కొత్త కన్సాలిడేటెడ్ రిమోట్ డిపార్చర్ అనుభవం’ను ప్రవేశపెట్టేందుకు DXB సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇలాంటి ప్రయాణికులు టెర్మినల్‌లోని బోర్డింగ్ ప్రాంతాలు లేదా వేచి ఉండే లాంజ్‌ల నుంచి బస్సుల్లో విమానం వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. కొత్త విధానంలో ఈ ప్రక్రియను మరింత క్రమబద్ధంగా, సులభంగా నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఇది ఏ టెర్మినల్‌లో, ఏ ఎయిర్‌లైన్స్‌కు వర్తిస్తుంది.. ప్రయాణికుల ప్రక్రియలో ఎలాంటి మార్పులు ఉంటాయనే వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.

ప్రయాణికుల రద్దీ తగ్గించే చర్యలు

విమానాశ్రయంలో ప్రయాణికుల కదలికలను మెరుగుపరిచేందుకు స్మార్ట్ ఆపరేషనల్ సిస్టమ్స్‌ను కూడా అమలు చేయనున్నారు. కీలక ప్రయాణికుల ప్రాంతాల్లో సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, నావిగేషన్‌ను సులభతరం చేయడం, రద్దీ ఏర్పడే ప్రాంతాలను తగ్గించడం, వేచి ఉండే ప్రదేశాల్లో సౌకర్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారిస్తున్నారు.

బయోమెట్రిక్ ప్రయాణానికి పెరుగుతున్న ఆదరణ

ప్రయాణికులు కూడా పాస్‌పోర్టులు, ఇతర పత్రాల వినియోగాన్ని తగ్గించే సాంకేతికతను ఎక్కువగా స్వీకరిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. IATA 2025 గ్లోబల్ ప్యాసింజర్ సర్వే ప్రకారం, 50 శాతం మంది ప్రయాణికులు తమ ప్రయాణంలో ఏదో ఒక దశలో ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగించారు. పాస్‌పోర్ట్ లేదా బోర్డింగ్ పాస్ తనిఖీలను తప్పించుకునే అవకాశం ఉంటే 74 శాతం మంది బయోమెట్రిక్ డేటాను పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే 78 శాతం మంది డిజిటల్ పాస్‌పోర్ట్, చెల్లింపులు, లాయల్టీ వివరాలను ఒకే స్మార్ట్‌ఫోన్ సొల్యూషన్ ద్వారా నిర్వహించేందుకు ఆసక్తి చూపారని అధికారులు వెల్లడించారు.

DXBలో ఈ పెట్టుబడులు విమానాశ్రయం కష్టతరమైన ఏడాది తొలి అర్ధభాగం నుంచి కోలుకుంటున్న సమయంలో కొనసాగుతున్నాయి. ఏడాది తొలి ఆరు నెలల్లో 31.5 మిలియన్ల ప్రయాణికులు DXBను వినియోగించారు. 2025లో ఇదే కాలంతో పోలిస్తే ఇది 31.3 శాతం తక్కువ.   అయితే రెండో త్రైమాసికంలో ప్రయాణికుల రద్దీ క్రమంగా పెరిగింది. ఏప్రిల్‌లో 3.5 మిలియన్ గా ఉన్న నెలవారీ ప్రయాణికుల సంఖ్య జూన్‌లో 5 మిలియన్లకు చేరింది. జూన్ చివరి నాటికి దాదాపు 50 అంతర్జాతీయ విమానయాన సంస్థలు DXB నుంచి సేవలు అందిస్తూ, 99 దేశాల్లోని 217 గమ్యస్థానాలకు కనెక్టివిటీ కల్పించాయి.

ఎయిర్‌లైన్ నెట్‌వర్క్‌లు, విమాన సర్వీసుల ఫ్రీక్వెన్సీలు తిరిగి పెరగడం, అంతర్జాతీయ ట్రాన్సిట్ ప్రయాణికుల సంఖ్య పెరగడం, వింటర్ షెడ్యూల్ ప్రారంభం, దుబాయ్‌లో జరిగే ప్రధాన వ్యాపార, పర్యాటక, క్రీడా కార్యక్రమాల కారణంగా ఏడాది ద్వితీయార్థంలో DXB ప్రయాణికుల రద్దీ మరింత పుంజుకుంటుందని దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ అంచనా వేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com