అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!

- August 27, 2026 , by Maagulf
అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!

అబుదాబి: చిన్న వయసున్న కుమార్తెను నానీ సంరక్షణలో ఉంచి ఎనిమిది రోజుల పాటు విదేశాలకు వెళ్లిన తల్లికి అబుదాబి సివిల్ ఫ్యామిలీ కోర్టు Dh80,000 జరిమానా విధించింది. చిన్నారి తండ్రి యూఏఈలోనే ఉండి, కుమార్తెను తానే చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ తల్లి నానీకి అప్పగించడాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. తల్లి ఈ తీర్పును సవాలు చేసినప్పటికీ, కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఆమె అప్పీల్‌ను తిరస్కరించి జరిమానాను, దాని మొత్తాన్ని సమర్థించింది. కాగా, ఈ కేసులో కోర్టు పిల్లలను నానీ వద్ద ఉంచడం చట్టవిరుద్ధమని సాధారణంగా చెప్పలేదు. ఈ ప్రత్యేక కేసులో పరిస్థితులను మాత్రమే పరిశీలించింది.

తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నప్పటికీ చిన్నారిపై జాయింట్ కస్టడీ హక్కులు ఇద్దరికీ ఉన్నాయి. తల్లి విదేశాలకు వెళ్లిన సమయంలో తండ్రి అందుబాటులో ఉండి, చిన్నారిని చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆమెను నానీ సంరక్షణలోనే ఉంచడం సమస్యగా కోర్టు భావించింది. దీంతోపాటు తల్లి విదేశాల్లో ఉన్న సమయంలో చిన్నారి తనకు సంబంధం లేని వేరే వ్యక్తితో ఒకే గదిలో ఉన్నట్లు కూడా కోర్టు గుర్తించింది.ఎనిమిది రోజుల వ్యవధిలో చిన్నారిని పిల్లి గీరడంతో, ఆమెకు రేబిస్‌ వ్యాక్సినేషన్‌ ప్రోటోకాల్‌ ప్రారంభించాల్సి వచ్చింది. ఈ ఘటన జరిగిన విషయాన్ని తల్లి కూడా ఖండించలేదు.చిన్నారి భద్రతకు తగిన రక్షణ కల్పించలేదని, తల్లిదండ్రుల ఉమ్మడి కస్టడీ ఏర్పాట్లకు అనుగుణంగా వ్యవహరించలేదని కోర్టు నిర్ధారించింది.

అబుదాబి సివిల్ ఫ్యామిలీ ఫ్రేమ్‌వర్క్‌లోని 2022 నాటి రిజల్యూషన్ నంబర్ 8లోని ఆర్టికల్ 40 ప్రకారం, జాయింట్ కస్టడీ ఏర్పాట్లను లేదా న్యాయమూర్తి ఆదేశాలను పాటించని తల్లిదండ్రులపై ఆర్థిక జరిమానా విధించే అధికారం కోర్టుకు ఉంది.ఈ కేసులో తల్లి గైర్హాజరైన ప్రతి రోజుకు Dh10,000 చొప్పున లెక్కించి మొత్తం Dh80,000 జరిమానా విధించారు.అయితే ఇది పిల్లలను నానీ వద్ద ఎన్ని రోజులు ఉంచితే చట్టవిరుద్ధమవుతుందనే నిర్ణయం కాదని కోర్టు స్పష్టం చేసింది.  

తల్లి భవిష్యత్తులో విదేశాలకు వెళ్లాల్సి వస్తే, తండ్రి యూఏఈలో అందుబాటులో ఉన్న సమయంలో చిన్నారిని తండ్రి సంరక్షణకు అప్పగించాలి అని కోర్టు పేర్కొంది.చిన్నారిని తనతో కలిసి విదేశాలకు తీసుకెళ్లాలనుకుంటే తండ్రి అనుమతి లేదా కోర్టు అనుమతి పొందాల్సి ఉంటుంది. కనీసం ఒక తల్లిదండ్రి సంరక్షణ లేకుండా చిన్నారిని వదిలివేయరాదని కూడా కోర్టు ఆదేశించింది. ఇలాంటి ప్రవర్తన మళ్లీ జరిగితే జరిమానా రెట్టింపు అవుతుందని కోర్టు హెచ్చరించింది.

చట్ట నిపుణుడు బైరన్ జేమ్స్ మాట్లాడుతూ.. ఈ తీర్పును తల్లిదండ్రులు పిల్లల సంరక్షణ కోసం నానీలను లేదా ఇంటి సిబ్బందిని ఉపయోగించడంపై సాధారణ నిషేధంగా భావించకూడదని తెలిపారు. విడాకులు తీసుకున్న లేదా విడిగా జీవిస్తున్న తల్లిదండ్రులకు ఈ కేసు ఒక గైడ్ లైన్స్ లాంటిదని.. ప్రయాణ సమయంలో పిల్లల సంరక్షణ అవసరమైతే అందుబాటులో ఉన్న సహ-తల్లిదండ్రికి (co-parent) ముందుగా అవకాశం ఇవ్వాలని అని అన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com