ఐసీఆర్‌ఎఫ్ సమ్మర్ డ్రైవ్‌.. 4500 మంది కార్మికులకు ప్రయోజనం..!!

- August 30, 2026 , by Maagulf
ఐసీఆర్‌ఎఫ్ సమ్మర్ డ్రైవ్‌.. 4500 మంది కార్మికులకు ప్రయోజనం..!!

మనామా: బహ్రెయిన్‌లో ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫోరం (ICRF) నిర్వహించిన వార్షిక ‘థర్స్‌ట్-క్వెంచర్స్ 2026’ వేసవి అవగాహన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. వరుసగా 11వ ఏడాది నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 4,500 మందికి పైగా బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులకు సహాయం అందించారు. కార్మిక మంత్రిత్వ శాఖ చేపడుతున్న వేసవి భద్రతా కార్యక్రమాలకు అనుగుణంగా ఈ ఏడాది డ్రైవ్‌ను నిర్వహించారు. తుది కార్యక్రమాన్ని సిత్రాలోని ఓ ప్రధాన వర్క్‌సైట్‌లో నిర్వహించగా, 500 మందికి పైగా బహిరంగ ప్రదేశాల్లో పనిచేస్తున్న కార్మికులకు చల్లటి నీరు, జ్యూస్‌లు, తాజా పండ్లు, లబాన్, ఐస్‌క్రీమ్‌లను పంపిణీ చేశారు.

11 వారాల పాటు అవగాహన కార్యక్రమాలు
బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కార్మిక మంత్రిత్వ శాఖ, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA), ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) సహకారంతో 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. 11 వారాల పాటు ప్రతి వారం నిర్వహించిన కార్యక్రమాల ద్వారా మొత్తం 4,500 మందికి పైగా కార్మికులకు ప్రయోజనం చేకూరింది. 2016లో ప్రారంభమైన ‘థర్స్‌ట్-క్వెంచర్స్’ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు బహ్రెయిన్‌లో 26,000 మందికి పైగా బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులకు ప్రత్యక్షంగా సహాయం అందింది.
సిత్రాలో జరిగిన ముగింపు కార్యక్రమంలో కార్మిక మంత్రిత్వ శాఖ వర్కర్స్ విభాగం అధిపతి ఇంజినీర్ హుస్సేన్ అల్ హుసైనీ పాల్గొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో కార్మికుల భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న సహాయాన్ని ఆయన వివరించారు. ఐసీఆర్‌ఎఫ్ సలహాదారు డాక్టర్ బాబు రామచంద్రన్ కూడా కార్మికులకు వేడి నుంచి రక్షణ పొందే మార్గాలు, తగినంత నీరు తాగడం, డీహైడ్రేషన్‌ను నివారించడం, వేడి కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యల నుంచి జాగ్రత్త పడటం వంటి అంశాలపై సూచనలు చేశారు.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com