ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!

- August 30, 2026 , by Maagulf
ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!

మస్కట్: ఒమన్ చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియం అరుదైన ఘనత సాధించింది. మ్యూజియం ఎగ్జిబిషన్ హాళ్లు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 10 లక్షల మంది సందర్శకులు సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మ్యూజియంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి 10 లక్షవ సందర్శకుడిని ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయనకు మ్యూజియంలోని వివిధ గ్యాలరీలను ప్రత్యేకంగా చూపించారు.

81 శాతం ఒమనీలు
మ్యూజియాన్ని సందర్శించిన వారిలో ఒమన్ పౌరులే అధికంగా ఉన్నారు. మొత్తం సందర్శకుల్లో 81 శాతం మంది ఒమనీలు కాగా, మిగిలిన 19 శాతం మంది విదేశీ పర్యాటకులు ఉన్నట్లు మ్యూజియం తెలిపింది. 10 లక్షలవ సందర్శకుడికి నిర్వహించిన ప్రత్యేక పర్యటనలో ఒమన్‌కు సంబంధించిన కీలక చారిత్రక ప్రదేశాలు, ఇంటరాక్టివ్ ఎగ్జిబిట్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చరిత్రను వివరించే ప్రదర్శనలను చూపించారు.

మ్యూజియం డైరెక్టర్ జనరల్ ఇంజినీర్ అల్ యక్దాన్ అబ్దుల్లా అల్ హార్తీ మాట్లాడుతూ.. 10 లక్షల మంది సందర్శకుల మైలురాయి తమ మ్యూజియాన్ని సందర్శించి ఒమన్ చరిత్ర, వారసత్వాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరికీ సంబంధించిన విజయమని అన్నారు. మ్యూజియం ప్రారంభమైనప్పటి నుంచి సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. 10 లక్షల మంది సందర్శకుల మైలురాయి మరింత మెరుగైన సేవలు, ప్రదర్శనలు అందించేందుకు తమకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.
2023లో ప్రారంభం
ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియం 2023 మార్చి 13న సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఆధ్వర్యంలో అధికారికంగా ప్రారంభమైంది. అప్పటి నుంచి ఒమన్ చరిత్ర, నాగరికత, సాంస్కృతిక వారసత్వాన్ని ఆధునిక ఎగ్జిబిషన్ పద్ధతులు, ఇంటరాక్టివ్ అనుభవాల ద్వారా సందర్శకులకు అందిస్తూ ప్రముఖ సాంస్కృతిక, విద్యా, పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. 10 లక్షల మంది సందర్శకుల మైలురాయి మ్యూజియంపై దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనంగా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com