ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!

- September 08, 2026 , by Maagulf
ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే పబ్లిక్ ఈవెంట్ కోసం దేశంలోనే తొలిసారిగా ‘బుక్‌మైషో’ (BookMyShow) డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ వేదికగా ఉచిత రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టగా అపూర్వ స్పందన లభించింది. గుజరాత్‌లోని వడోదరలో జరిగే ఈ కార్యక్రమం కోసం బుక్‌మైషోలో ఉచిత బుకింగ్ ప్రారంభించగా, కేవలం గంట వ్యవధిలోనే అందుబాటులో ఉన్న టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఉచిత రిజిస్ట్రేషన్ల కోటా పూర్తయినప్పటికీ, ఈ సభకు హాజరయ్యేందుకు దాదాపు 42 వేల మందికి పైగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉండటం విశేషం. సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగిస్తూ, సభలకు వచ్చే ప్రజల రద్దీని నియంత్రించేందుకు మరియు డిజిటల్ ఎంట్రీ కల్పించేందుకు ఈ వినూత్న విధానం ఎంతో దోహదపడుతోందని నిర్వాహకులు చెబుతున్నారు.

‘నమో ఫర్ వికసిత్ భారత్’ – రూ. 35 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనుల ప్రారంభం

వడోదర మున్సిపల్ కార్పొరేషన్ (VMC) ఆధ్వర్యంలో ‘నమో ఫర్ వికసిత్ భారత్’ పేరుతో చేపట్టిన ఈ ప్రయోగం ఆశించిన దానికంటే అత్యంత విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ఎంపికైన వారికి బుక్‌మైషో ద్వారా లైవ్ క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ ఎం-టికెట్లు అందిస్తారు. ఇక ఈ సభ వేదికగా ప్రధాని మోదీ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి రూ. 35,000 కోట్లకు పైగా విలువైన పలు కీలక రైల్వే, హైవే మరియు మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేయనున్నారు. పబ్లిక్ ఈవెంట్లను నిర్వహించడంలో ఈ డిజిటల్ ప్రయోగం విజయం సాధించడంతో రాబోయే రోజుల్లో ఇతర ప్రాంతాల్లోనూ ఈ తరహా మోడల్‌ను అమలు చేసే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com