యూఏఈలో కార్మిక చట్ట ఉల్లంఘనలు 15 శాతం తగ్గుదల
- September 09, 2026
అక్రమ నియామకాలు, వేతనాల చెల్లింపులో జాప్యం ఇప్పటికీ ప్రధాన ఉల్లంఘనలు
దుబాయ్: యూఏఈ ప్రైవేట్ రంగ సంస్థల్లో కార్మిక చట్టాల ఉల్లంఘనలు 2026 తొలి ఆరు నెలల్లో 15 శాతం తగ్గినప్పటికీ, అనుమతి లేకుండా కార్మికులను నియమించడం, వేజ్ ప్రొటెక్షన్ సిస్టమ్ (WPS) ద్వారా వేతనాలు చెల్లించకపోవడం, తప్పుడు సమాచారం లేదా పత్రాలు సమర్పించడం వంటి ఉల్లంఘనలు ఇప్పటికీ ప్రధానంగా నమోదవుతున్నాయని మానవ వనరులు, ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ (MOHRE) వెల్లడించింది.
కార్మికులను నియమించే లేదా ఉద్యోగంలోకి తీసుకునే ముందు సంస్థలు అవసరమైన అన్ని అనుమతులు, ఆమోదాలు పొందాలని MOHRE స్పష్టం చేసింది. అలాగే నిర్దేశిత గడువులోగా ఉద్యోగుల వేతనాలను WPS ద్వారా చెల్లించాల్సిన బాధ్యత సంస్థలపై ఉందని పేర్కొంది.
అవసరమైన అనుమతి లేకుండా కార్మికుడిని ఉద్యోగంలోకి తీసుకుంటే Dh100,000 నుంచి Dh1 మిలియన్ వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కార్మికులను దేశానికి తీసుకొచ్చి ఉద్యోగం కల్పించకపోయినా, వర్క్ పర్మిట్లను దుర్వినియోగం చేసినా ఇదే స్థాయిలో జరిమానాలు వర్తిస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
జీతాల చెల్లింపు పై కొత్త నిబంధనలు
జీతాల చెల్లింపులకు సంబంధించి ఈ ఏడాది జూన్ 1 నుంచి కొత్త WPS నిబంధనలు అమల్లోకి వచ్చాయి. గత నెలకు సంబంధించిన వేతనాలను ప్రతి గ్రెగోరియన్ నెల మొదటి తేదీనాటికి చెల్లించాల్సి ఉంటుంది.
గడువు ముగిసిన రెండో రోజు నుంచి వేతనాలు చెల్లించని సంస్థలకు హెచ్చరికలు పంపిస్తారు. ఐదో రోజు వరకు కూడా జీతాలు చెల్లించకపోతే కొత్త వర్క్ పర్మిట్ల జారీపై నిలిపివేత విధించే అవకాశం ఉంది.
తప్పుడు పత్రాల సమర్పణ పై చర్యలు
సంస్థలు తప్పుడు సమాచారం లేదా పత్రాలను సమర్పించినా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధికారిక యూఏఈ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, తప్పు పత్రాలు సమర్పించిన సంస్థలకు వర్క్ పర్మిట్లను జారీ చేయడం లేదా పునరుద్ధరించడం MOHRE నిరాకరించవచ్చు. ఇప్పటికే జారీ చేసిన పర్మిట్లను రద్దు చేసే అవకాశం కూడా ఉంది.
WPS లేదా ఇతర కార్మిక మార్కెట్ నియంత్రణ వ్యవస్థలను పాటించని సంస్థలపైనా ఇదే తరహా చర్యలు తీసుకోవచ్చు.
పబ్లిక్ ప్రాసిక్యూషన్కు కేసుల తగ్గుదల
2026 తొలి ఆరు నెలల్లో కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రైవేట్ రంగ సంస్థల సంఖ్య గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 15 శాతం తగ్గింది.
అదే సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపిన కేసుల సంఖ్య దాదాపు సగానికి తగ్గింది. 2025 తొలి ఆరు నెలల్లో 962 కేసులు రిఫర్ కాగా, 2026లో ఈ సంఖ్య 49 శాతం తగ్గి 490కి చేరింది. న్యాయపరమైన చర్యలు అవసరమయ్యే తీవ్రమైన ఉల్లంఘనలు తగ్గుతున్నాయని ఇది సూచిస్తోందని MOHRE తెలిపింది.
2.12 లక్షల తనిఖీలు
ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో MOHRE తనిఖీ బృందాలు సుమారు 2,12,000 తనిఖీలు నిర్వహించాయి. అధిక ప్రమాదం ఉన్న సంస్థలు, కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు “స్మార్ట్ మానిటరింగ్ సిస్టమ్”ను ఉపయోగిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ వ్యవస్థలో కృత్రిమ మేధస్సు (AI), డేటా అనలిటిక్స్, వివిధ రిస్క్ సూచికలను ఉపయోగించి తనిఖీలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సంస్థలు, కేసులను గుర్తిస్తున్నారు.
కార్మిక చట్టాల అమలును మరింత బలోపేతం చేయడంతో పాటు, సంస్థలు ముందస్తుగా నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించడం కొనసాగిస్తామని MOHRE తెలిపింది. యూఏఈలో సురక్షితమైన, స్థిరమైన, పోటీతత్వంతో కూడిన కార్మిక వాతావరణాన్ని కొనసాగించేందుకు యజమానులతో కలిసి పనిచేస్తామని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈలో కార్మిక చట్ట ఉల్లంఘనలు 15 శాతం తగ్గుదల
- బాలల నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘పాడనా తెలుగు పాట’
- జర్మనీ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్..
- గవర్నర్ ని కలిసిన BRS నేతలు
- బిగ్బాస్ హౌస్లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!
- కొత్త ప్రభుత్వ సీజన్ పై షేక్ మహమ్మద్ సమీక్ష..
- యూఏఈకి తిరిగి వస్తున్న విజ్ ఎయిర్..
- తిరుమల బ్రహ్మోత్సవాలు ఖరారు.. సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి ఉత్సవాలు
- బహ్రెయిన్-సౌదీ మధ్య సరిహద్దు ట్యాక్సీ సేవలు ప్రారంభం..
- ఖతార్ అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!







