శబరిమలలో ఇకపై రోజుకు 5 పడి పూజలు
- September 10, 2026
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు సంబంధించిన పడి పూజల నిర్వహణపై ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై శబరిమలలో రోజుకు ఐదు పడి పూజలు నిర్వహించనున్నట్లు కేరళ హైకోర్టుకు బోర్డు వెల్లడించింది. ఇప్పటికే బుక్ చేసుకున్న పడి పూజలు పూర్తయిన తర్వాతే కొత్త బుకింగ్లను ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం 2040 సంవత్సరం వరకు పడి పూజ కోసం 705 మంది భక్తులు బుకింగ్ చేసుకున్నట్లు దేవస్వం బోర్డు తెలిపింది. ఒక్కో పడి పూజకు రుసుము రూ.1,37,900గా ఉంది. అయితే మండల-మకరవిళక్కు సీజన్లో మాత్రం పడి పూజలు నిర్వహించరు.
పడి పూజ బుకింగ్లపై డిజిటలైజేషన్
ఇప్పటికే పడి పూజకు బుక్ చేసుకున్న భక్తుల పేర్లను డిజిటల్ రూపంలోకి మార్చనున్నట్లు బోర్డు వెల్లడించింది. బుకింగ్ జాబితాలో మరణించిన వ్యక్తుల పేర్లు ఉంటే వాటిని గుర్తించి తొలగించనున్నట్లు తెలిపింది. ఈ అంశంపై జస్టిస్ బి. రాజా విజయరాఘవన్, జస్టిస్ కె.వి. జయకుమార్లతో కూడిన దేవస్వం ధర్మాసనం విచారణ చేపట్టింది.
చిన్న దుకాణం తొలగింపునకు హైకోర్టు ఆదేశం
శబరిమలలోని కొప్రక్కలం ప్రాంతానికి సమీపంలో ఉన్న చిన్న దుకాణాన్ని వెంటనే తొలగించాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. అలాగే చాలకాయం-పంబ రహదారి పునరుద్ధరణ పనుల కోసం రూ.15 కోట్లు కేటాయించినట్లు దేవస్వం బోర్డు కోర్టుకు వివరించింది. మరోవైపు శబరిమలలో అన్నదాన మండపం నిర్మాణం పూర్తయినప్పటికీ ఇంకా ఎందుకు ప్రారంభించలేదో వివరణ ఇవ్వాలని కోర్టు దేవస్వం బోర్డును ఆదేశించినట్లు సమాచారం.
అరవణ ప్రసాదం తయారీ సామర్థ్యం పెంపు
శబరిమలలో భక్తులకు అత్యంత ప్రసిద్ధమైన అరవణ ప్రసాదం తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం రోజుకు సుమారు 2 లక్షల నుంచి 2.25 లక్షల వరకు అరవణ కంటైనర్లను తయారు చేస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో డిమాండ్ను అందుకునేలా ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆరు కొత్త అరవణ తయారీ యూనిట్లు, రెండు కూలింగ్ ఛాంబర్లు, ఒక బాయిలర్ ఏర్పాటు చేయనున్నారు.ప్రస్తుతం శబరిమల అరవణ ప్లాంట్లో 26 తయారీ యూనిట్లు, ఆరు కూలింగ్ ఛాంబర్లు, ఆరు బాయిలర్లు పనిచేస్తున్నాయి. కొత్త యూనిట్లు అందుబాటులోకి వస్తే రోజువారీ అరవణ ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరగనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో వాడీ అల్-బుహైర్ మూసివేయలేదు..!!
- కువైట్లో నలుగురు భారతీయులు అరెస్ట్..!!
- ఒమన్లో డ్రగ్స్ అక్రమ రవాణాకు మరణశిక్ష, భారీ జరిమానాలు..!!
- ఇద్దరు బంగ్లాదేశీయులను రక్షించిన సౌదీ రెస్క్యూ టీమ్..!!
- 56% నెట్వర్క్ను పునరుద్ధరించిన ఎమిరేట్స్..!!
- 4 మిలియన్ల ప్రయాణికులకు సిద్ధమైన ఖతార్..!!
- ఇరాన్ యుద్ధం ముగింపు పై ట్రంప్ కీలక ప్రకటన
- యూఏఈలో పెట్టుబడుల కోసం ఒడిశా సీఎం మాఝీ దూకుడు.. రూ.2.1 లక్షల కోట్ల ఒప్పందం
- వినియోగదారుని పై బ్యాంకు చార్జీల భారం!
- శబరిమలలో ఇకపై రోజుకు 5 పడి పూజలు







