కలాం సన్నిహితుడితో రజిని భేటీ
- September 05, 2016
దక్షిణాది సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా? రారా? అనే అంశం దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. తమిళనాడులో ఎన్నికల సమయం దగ్గరపడితే చాలు రజినీకాంత్ ఆ పార్టీలో చేరతారు?, ఈ పార్టీలో చేరతారు? లేదా సొంత పార్టీతో ఎన్నికల బరిలో నిలుస్తారంటూ ఊహాగానాలు చక్కర్లు కొడుతూ ఉండేవి.
కాగా, తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు గమనించినట్లయితే ఆ ఊహాగానాలకు తెరపడే సమయం దగ్గరపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్తో దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం సన్నిహితుడు పొన్రాజ్ భేటీ కావడమే ఇందుకు కారణమని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
పొన్రాజ్.. అబ్దుల్ కలాం విజన్ ఇండియా పార్టీ (అబ్దుల్ కలాం వీఐపీ) వ్యవస్థాపకుడు కావడం గమనార్హం. రజనీకాంత్ సినిమా డైలాగులు ఆధారంగా ఆయన అభిమానులు రాజకీయ రంగ ప్రవేశంపై అంచనాలు వేస్తుంటారు. నరసింహలోని 'నా దారి రహదారి', భాషాలోని 'నేను ఒకసారి చెబితే వందసార్లు చెప్పినట్లు', బాబాలోని 'రావలసిన సమయానికి సరిగ్గా వస్తాను' అనే డైలాగులను ఇందుకు ఉదాహరణగా చెబుతుంటారు.
కాగా, నేటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని పొన్రాజ్ అభిప్రాయపడగా.. 'దేవుని చిత్తం అదే అయితే అలాగే జరుగుతుంది' అంటూ రజనీకాంత్ వ్యాఖ్యానించారని సమాచారం. రజనీకాంత్ వంటి వ్యక్తులు రాజకీయాల్లో తప్పకుండా ఉండాలని పొన్రాజ్ బలంగా కోరుకుంటున్నారని సమాచారం.
అయితే, గతంలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడంతో ఆయన బిజెపిలో చేరతారని ఊహాగానాలు వచ్చాయి, అంతేగాక, రాష్ట్ర బిజెపి నేతలు కూడా రజినీతో చర్చలు జరిపారు. అయితే, వారి ప్రతిపాదన కూడా అలాగే ఉండిపోయింది.
ప్రస్తుతం రజనీకాంత్ రోబో-2 చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రజనీకాంత్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చే వరకు ఆయన రాజకీయాల్లో వస్తారా? లేదా? అనే అంశం మళ్లీ ప్రశ్నార్థకంగానే మిగలనుంది. అయితే, రజనీకాంత్ అభిమానులతోపాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ఆయన రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







