గల్ఫ్‌ ఏజెంట్‌ అనుమానాస్పద మృతి

- September 13, 2016 , by Maagulf
గల్ఫ్‌ ఏజెంట్‌ అనుమానాస్పద మృతి

అనంతపురంలో  మద్దాలపేటకు చెందిన మహిళా గల్ఫ్‌ ఏజెంట్‌ గెడ్డం సుబ్బాయమ్మ అనే నజ్మా (50) అనుమాన స్పద స్థితిలో తన ఇంట్లోనే మృతి చెందింది. ఆమె తన ఇంట్లో మంచపై 10 రోజుల కిందటే మరణించినట్టు పోలీసులు భావిస్తున్నారు. తొలుత అనుమానాస్పద కేసుగా దీన్ని నమోదు చేసిన పోలీసులు హత్య జరిగి ఉండవచ్చనే దిశలో దర్యాప్తు చేస్తున్నారు. నజ్మాకు మద్దాలపేటలో రెండతస్తుల భవనం ఉంది. పై అంతస్తులో ఆమె ఒక్కరే ఉంటున్నారు. క్రింది భాగాన్ని అద్దెకు ఇచ్చింది.

నజ్మా కొన్నేళ్లు పాటు గల్ఫ్‌లోనే ఉంది. తర్వాత గల్ఫ్‌ ఏజెంట్‌గా ఈ ప్రాంతం నుంచి అనేక మందిని ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు పంపించింది. మస్కట్‌లో ఆమెకు ఓ కార్యాలయం కూడా ఉంది. నజ్మా ఇంటినుంచి దుర్వాసన వస్తుండడంతో ఆ భవనంలో కింద అద్దెకు ఉంటున్నవారు ఆమె బంధువులకు సమాచారం అందించారు.

వారు కిటికీ అద్దాలు పగులకొట్టి చూడగా ఏసీ ఆన్‌ చేసి ఉన్న బెడ్‌ రూంలో మంచంపై నజ్మా మృతదేహం కుళ్లి, ఉబ్బి పోయి ఉన్నట్టు గుర్తించారు. వారి ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌ తన సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. పోలీసు దర్యాప్తులో నజ్మా ఈ నెల 1వ తేదీ రాత్రి తనకు సంబంధించిన ఓ కోర్టు కేసు విషయమై ఓ లాయర్‌తో మాట్లాడినట్టు తేలింది. ఆ తర్వాత నుంచి ఆమె సెల్‌ ఫోన్‌ స్పందన లేదని ఆమె బంధువులు చెబుతున్నారు.

పై అంతస్తుకు వెళ్లేందుకు మెట్ల వద్ద ఇనుప చట్రం గేటు ఉంది. దానికి బయట తాళం వేసి ఉంది. అలాగే పై అంతస్తులో కూడా ఇంటికి తాళం వేసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె ఇంట్లోనే ఉండగా ఇంటికి, గేటుకు తాళాలు వేసి ఉండటాన్ని బట్టి ఎవరో నజ్మాను కావాలనే ఇంట్లోనే హత్య చేసి తాళాలు వేసి ఉడాయించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

తలుపులు వేసి తాళం కప్పలు ఉండటంతో ఆమె ఊరెళ్లిందేమోనని కింద భాగంలో ఉన్న వారు అనుకుంటున్నారు. ఆమె వద్ద బంగారు నగలు ఎక్కువగా ఉండటంతో నగల కోసం పీక నొక్కి లేదా ముఖంపై తలగడ వంటివి ఉంచి ఉపిరాడకుండా చేసి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సీఐ శ్రీనివాస్, ఎస్సై పెద్దిరాజు ఘటనా స్థలంలోనే వీఆర్వోల సమక్షంలో నజ్మా మృతదేహానికి శవ పంచనామా నిర్వహించారు. పోస్టు మార్టం కోసం మృతదేహాన్ని అమలాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

నజ్మాకు కొందరితో సన్నిహిత సంబంధాలు, వివాదాలు ఉండటంతో వారిలో ఎవరైనా హత్య చేశారా...? అనే కోణంలో పోలీసులు ఆమెకు అత్యంత పరిచయస్తులు, వ్యతిరేకులను విచారిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఇద్దర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. నజ్మా ఏ కారణంతో చనిపోయిందో పోస్టు మార్టం రిపోర్టులోనే తేలుతుందని సీఐ శ్రీనివాస్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com