సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు ..
- September 18, 2016
ఇప్పుడెక్కడి సంక్రాంతి? ఇంకో ఐదు నెలల సమయం ఉంది కదా... అని తేలిగ్గా తీసుకోమాకండి. ఆ పండగ హంగామానే వేరుగా ఉంటుంది. సంక్రాంతి పండక్కి Üరెళ్దాం అనుకొనేవాళ్లంతా 'రిజర్వేషన్ల' విషయంలో ముందే తొందరపడుతుంటారు కదా. సినిమా వాళ్లు కూడా అంతే. సంక్రాంతి బరిలో దిగాలని ముందు నుంచీ సన్నాహాలు చేసుకొంటూ ఉంటారు. 'సంక్రాంతికి మేం వచ్చేస్తున్నాం' అని ముందే చెప్పేస్తే - బిజీగా ఉండే ఆర్టీసీ బస్సులో కచ్చీఫ్ వేసుకొన్నంత భరోసాగా ఉంటుంది. అందుకే ముగ్గుల పండక్కి ముందస్తుగానే సన్నాహాలు చేసుకొంటుంటుంది తెలుగు చిత్రపరిశ్రమ. సంక్రాంతికి ఏయే సినిమాలు రాబోతున్నాయన్న విషయంలో నాలుగైదు నెలల ముందే ఓ క్లూ దొరికేస్తుంది.
ఈసారీ అంతే. సంక్రాంతికి రాబోతున్న సినిమాలేమిటన్న విషయం ముందే తెలిసిపోయింది. ఈసారి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు చిత్రాలు ఢీ కొట్టబోతున్నాయి. సీనియర్ కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఈసారి బరిలో దిగబోతుండడం ఆసక్తికి రేకెత్తిస్తోంది.
దశాబ్దాల పాటు అగ్ర కథానాయకులుగా కొనసాగారు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున. వీళ్లు నటించిన సినిమాలు ఓకేసారి బాక్సాఫీసు ముందు రావడం వాళ్ల కెరీర్లో ఒక్కసారి కూడా జరగలేదు. అయితే తొలిసారి ఈ ఫీట్ జరగబోతోంది. చిరంజీవి 'ఖైదీ నంబర్ 150', బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి', నాగార్జున 'ఓం నమో వేంకటేశాయ' ఈ సంక్రాంతికి రాబోతున్నాయి. ఏ తేదీన వచ్చేదీ కచ్చితంగా తెలియకపోయినా వీళ్ల దృష్టి సంక్రాంతిపైనే ఉందన్నది వాస్తవం. చిరు, బాలయ్య చిత్ర బృందాలు 'ఇప్పటికే సంక్రాంతికి వచ్చేస్తున్నాం...' అని ప్రకటించాయి. నాగార్జున కూడా ఇటీవల 'మా చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలనుకొంటున్నాం' అని చెప్పేశారు. దాన్ని బట్టి ఈసారి బాక్సాఫీసు దగ్గర ముక్కోణపు పోటీ ఉండబోతోందన్నది స్పష్టమైంది.
పోగ్రెస్ రిపోర్ట్ ఏంటి?
సంక్రాంతి బరిలో దిగాలంటే డిసెంబరు చివరి నాటికి ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకోవాల్సిందే. ఈ మూడు చిత్రాల పోగ్రెస్ చూస్తే... అనుకొన్న సమయానికి తమ చిత్రాల్ని రెడీ చేయడం ఖాయమనిపిస్తోంది. చిరు సినిమా ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకొంది. ఇంచుమించుగా బాలయ్య సినిమా కూడా అంతే. కాకపోతే 'గౌతమిపుత్ర..'కు విజువల్ ఎఫెక్ట్స్తో ఎక్కువ పని ఉంది. రెండు నెలల ముందే చిత్రీకరణ పూర్తి చేసి విజువల్ ఎఫెక్ట్స్ పనులు మొదలెట్టాలని చిత్రబృందం భావిస్తోంది. అందుకే క్రిష్ కూడా షూటింగ్ పనుల్ని వేగవంతం చేశారు. మరోవైపు రాఘవేంద్రరావు కూడా.. నమో వేంకటేశాయని చకచక నడిపిస్తున్నార్ట. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రీకరణ ప్రస్తుతం మధ్యప్రదేశ్లో జరుగుతోంది. బాలకృష్ణ, హేమామాలిని, శ్రియలపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. 'ఖైదీ నెం.150' షూటింగ్ హైదరాబాద్లో సాగుతోంది. చిరంజీవిపై యాక్షన్ ఎపిసోడ్స్ని చిత్రీకరిస్తున్నారు. 'ఓం నమో వేంకటేశాయ' విషయానికొస్తే అనుష్కపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఈ మూడు చిత్రాల పాటల వేడుక డిసెంబరులో నిర్వహించే అవకాశాలున్నాయి. వీటితో పాటుగా శర్వానంద్ నటిస్తున్న 'శతమానం భవతి' చిత్రాన్నీ సంక్రాంతికే విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఇప్పటికే దిల్రాజు ఈ విషయమై ఓ స్పష్టమైన ప్రకటన చేశారు కూడా. ఈ యేడాది శర్వానంద్ సినిమా 'ఎక్స్ప్రెస్రాజా' సంక్రాంతి బరిలో నిలిచి విజయం సాధించింది.
అదొక్కటే సమస్య
సంక్రాంతిలాంటి పండగలకు ఎన్ని సినిమాలొస్తే అంత కళ. ఎన్ని సినిమాలొచ్చినా చూడ్డానికి ప్రేక్షకులు సిద్దంగానే ఉంటారు. కానీ తగినన్ని థియేటర్లు దొరుకుతాయా, లేదా? అనేదే పెద్ద సమస్య. ఈ ఏడాది కూడా సరిగ్గా నాలుగు చిత్రాలే బరిలో దిగాయి. నాలుగింటికీ థియేటర్లు దొరికాయి. అయితే ఈసారి ముగ్గురు అగ్ర కథానాయకులు రేసులో ఉండడంతో థియేటర్ల సమస్య ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాన్ని దాటితే మాత్రం ఈ సంక్రాంతి కాస్తా సినీ సంక్రాంతిగా మారడం ఖాయం.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









