దేశవ్యాప్తంగా హైఅలర్ట్ జారీ ...
- September 30, 2016
దేశమంతా అత్యంత అప్రమత్తమైంది. మెట్రోనగరాలు, సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని అన్ని రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. పాక్లోని ఉగ్ర శిబిరాలపై భారత సేనలు జరిపిన సర్జికల్ దాడులకు ప్రతీకార దాడులు జరగవచ్చని నిఘా సంస్థలు హెచ్చరించాయి. పాక్లోని ఉగ్రమూకలు ఎప్పుడైనా ప్రతిదాడులకు పాల్పడే అవకాశముందని, దీనిపై తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉందని నిఘా వర్గాలు కేంద్ర హోంశాఖకు తెలిపాయి.దీంతో కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా హైఅలర్ట్ జారీ చేసింది. పాకిస్థాన్తో సరిహద్దును కలిగిన జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాతల్లో దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని, అక్కడ ప్రజల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో జనసమ్మర్ధ ప్రాంతాల్లో అదనపు భద్రతాదళాలను మోహరించాలని సూచించింది. సున్నితమైన ప్రాంతాల్లో నిఘా వ్యవస్థను పెంచాలని కోరింది. రాజ్నాథ్ సమీక్ష సర్జికల్ దాడుల అనంతర పరిస్థితిపై హోం మంత్రి రాజ్నాథ్ శుక్రవారం సమీక్షించారు. జాతీయ భద్రతాసలహాదారు అజిత దోవల్, హోం కార్యదర్శి రాజీవ్ మెహరిషి, ఆర్మీ ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. సుమారు గంటపాటు జరిగిన సమావేశంలో.. సరిహద్దుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలనైనా ఎదుర్కొనేందుకు బలగాలు సిద్ధంగా ఉండాలని హోం మంత్రి ఆర్మీ అధికారులను ఆదేశించారు. నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద హై అలర్ట్ నాగార్జునసాగర్, సెప్టెంబరు 30: నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నాగార్జునసాగర్ డ్యాం వద్ద హై అలర్ట్ ప్రకటించారు. డ్యాం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఎస్పీఎఫ్ ఆర్ఐ రమణరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిన్నటి వరకు ప్రధాన డ్యాం, ఎర్త్ డ్యాంలకు ఇరువైపులా 1+2(1 హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుల్లు)సిబ్బంది భద్రతా విధులు నిర్వరిస్తున్నారు. శుక్రవారం నుంచి 1+3 సిబ్బందిని నియమించినట్లు ఆయన తెలిపారు. కాగా, నాగార్జునసాగర్లో శుక్రవారం నుంచి తనిఖీలు ముమ్మరం చేసినట్టు ఎస్ఐ రజనీకర్ తెలిపారు. తీరంవెంబడి భద్రత పెంపు దేశవ్యాప్తంగా తీరప్రాంతం వెంబడి భద్రతను పెంచారు. ఉగ్రవాదులు సముద్రమార్గం గుండా దేశంలోకి చొరబడే అవకాశముందన్న నిఘావర్గాల సమాచారంతో కోస్టుగార్డు దళాలు అప్రమత్తమయ్యాయి. తీరప్రాంతాల్లో భద్రతాదళాల సన్నద్ధతను నేవీ ఉన్నతాధికారులు శుక్రవారం సమీక్షించారు. తీరం వెంబడి సున్నితమైన ప్రాంతాలను కోస్టుగార్డు దళాలు తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









