పశ్చిమ, అరబ్బు దేశాలు ఐఎస్‌ను పెంచి పోషిస్తున్నాయి : క్యాథలిక్‌ నన్‌ మథర్‌ ఆగెస్‌

- October 26, 2016 , by Maagulf
పశ్చిమ, అరబ్బు దేశాలు ఐఎస్‌ను పెంచి పోషిస్తున్నాయి : క్యాథలిక్‌ నన్‌ మథర్‌ ఆగెస్‌

 సిరియాలో పెట్రేగిపోయిన ఐఎస్‌ ఉగ్రవాదసంస్థకు పాశ్చాత్య, అరబ్బు దేశాలు మద్దతిస్తున్నాయని ఆ దేశంలో శాంతిస్థాపన కోసం కృషి చేస్తున్న ప్రచారకర్త, క్యాథలిక్‌ నన్‌ మథర్‌ ఆగెస్‌ మరియం తెలిపారు. బుధవారం రష్యాటుడే మీడియా సంస్థతో ఆమె మాట్లాడారు.' అంతర్యుద్ధం కారణంగా సిరియన్లు భయాందోళనలకు గురవుతున్నారు...వారిలో అభద్రతా భావం నెలకొంది. పశ్చిమ, అరబ్బు దేశాలు ఐఎస్‌ను పెంచి పోషిస్తున్నాయి. ఆయుధాల సరఫరాతో పాటు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. అంతర్జాతీయ సమాజమే ఉగ్రవాద సంస్థలకు రక్షణ వలయంగా మారింది.' అని చెప్పారు.

పాశ్చాత్య దేశాలు ఉగ్రవాదసంస్థలను అడ్డపెట్టుకొని ప్రజలను భయబ్రాంతులకు గురిచేయాల్సిన అవసరమేంటని ఆమె ప్రశ్నించారు. 
మారణహోమమే ఉగ్రవాద సంస్థల లక్ష్యం : మారణహోమాన్ని సృష్టించ డమే లక్ష్యంగా పెట్టుకుని ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయని ఆగెస్‌ మరియం అన్నారు. ఉగ్ర సంస్థలు ఆత్మరక్షణ కోసం పేర్లను కూడా మార్చుకుంటున్నాయన్నారు. ఈ మేరకు నిషేధిత జాబితాల్లో ఉన్న పేర్లను మార్చుకునేందుకు పాశ్చాత్య దేశాలు సహకరిస్తున్నాయని మరియం చెప్పారు. గతంలో నరమేధం సృష్టించిన అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ ప్రస్తుతం జబాత్‌-అల్‌-నుస్రాగా మారిపోయిందన్నారు. ఇదో పెద్ద తిరుగుబాటుదారు సంస్థగా అవతరించి ప్రజలను భయపెడుతోందన్నారు. అంతేగాకుండా వేలాది మందిని పొట్టనబెట్టుకుందన్నారు. సిరియాను దెబ్బతీసేందుకు పాశ్చాత్య, అరబ్బు దేశాలు కుట్రపన్నాయని చెప్పారు. దీనికి జబాత్‌-అల్‌-నుస్రా ఉగ్రవాద సంస్థ సహకారాన్ని తీసుకుంటున్నాయని అన్నారు. సిరియాలో 2011లో పౌర యుద్ధం ప్రారంభమైంది. ఈ అంతర్యుద్ధంలో 4లక్షల మంది మృతి చెందారు. లక్షలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఆహారం, ఔషదాల కొరతతో లక్షల మంది సిరియన్లు ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టామన్నారు. అయితే, పాశ్చాత్య మీడియా సంస్థలు తమ బృందాలు నిర్వహిస్తున్న సహాయక కార్యక్రమాలను వక్రీకరిస్తున్నాయని ఆరోపించారు. 
మథర్‌ ఆగెస్‌ : మథర్‌ ఆగెస్‌ మరియం హామ్స్‌ ప్రావిన్స్‌లోని సెయింట్‌ జేమ్స్‌ అనే సన్యాసుల ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. సిరియాలో శాంతిస్థాపన కోసం కృషి చేస్తున్నారు. అధ్యక్షుడు అస్సద్‌పై 2013లో ఆమె విమర్శలు గుప్పించారు. సిరియాలోని ఘౌటా ప్రాంతంలో రసాయనిక ఆయుధాల ప్రయోగం జరిగిందని అదే ఏడాది ఆగస్టులో అస్సద్‌ ప్రదర్శించిన వీడియోలన్నీ అభూతకల్పితాలని విమర్శించారు. ఆ వీడియోల్లో ఉన్న చిన్నారుల వివరాలు తెలియజేయాలని ఆమె అప్పట్లో డిమాండ్‌ చేశారు. అస్సద్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న చర్యలతో అంతర్జాతీయ మానవ హక్కులకు విఘాతం ఏర్పడిందని ఆరోపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com