జన నేతల జోడీ భళా.

- August 24, 2015 , by Maagulf
జన నేతల జోడీ భళా.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరో మలుపు తీసుకోనున్నాయా ప్రశ్న ఉదయిస్తోంది. బిజెపి, తెలుగుదేశం పార్టీలకు మద్దతు పలికిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన రూట్ మార్చినట్లు కనిపిస్తున్నారు. ఆ పార్టీలతో ఆయన తెగదెంపులు చేసుకుని కొత్త శక్తితో జత కడుతారనే చర్చ రాజకీయాల్లో సాగుతోంది. పవన్ కళ్యాణ్ లోకసత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణతో జత కట్టే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ నోట జయప్రకాష్ నారాయణ పేరు రావడంతో ఆ చర్చ ఊపందుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిపుణుల సలహాలను తీసుకోకుండానే ముందుకు సాగుతోందని అధినేత, టాలీవుడ్ ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు. మాజీ ఐఏఎస్, లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ (జేపీ)లాంటి అనుభవజ్ఞుల సలహాలు , సూచనలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వానికి సూచించారు. రాజకీయాల్లో జెపికి మంచి పేరు ఉండడమే కాకుండా మేధావుగా కూడా ఆయన గుర్తింపు పొందారు. అంతే కాకుండా ఆయనకు కొంత నిర్మాణం కూడా ఉంది. పవన్ కళ్యాణ్‌ పార్టీకి నిర్మాణమే చాలా కష్టంగా ఉంది. సినిమాల్లో బిజీగా ఉండడంతో పార్టీ నిర్మాణంపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టలేకపోతున్నారని అంటున్నారు. దీంతో జయప్రకాష్ నారాయణ తోడైతే రాజకీయాల్లో మార్పు తీసుకు రావడానికి ముందుకు దూకవచ్చుననే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. పెనుమాక రైతులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీపై ఘాటుగానే స్పందించారు. 3 వేల ఎకరాలంటే సామన్యమా అని ఆయన ప్రశ్నించారు. జయప్రకాష్ నారాయణ కూడా ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై గత కొద్ది కాలంగా విమర్శలు చేస్తున్నారు. దీంతో జయప్రకాష్ నారాయణ, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఒక్కటైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలకమైన మలుపు తిరుగుతాయని అంటున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com