కామెడీ నటులకు స్టార్‌ హోదా ...

- November 03, 2016 , by Maagulf
కామెడీ  నటులకు స్టార్‌ హోదా ...

సినిమాల్లో ఒక భాగమైన కామెడీ ఇప్పుడు ప్రధానంశమైంది. వినోదాత్మక కథా చిత్రాలకే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కామెడీ లేని చిత్రాల కొంతమేర నిరాశపరుస్తున్నాయి. కామెడీ పాత్రలు పోషిస్తున్న నటులకు స్టార్‌ హోదా వచ్చింది. అనేక మంది కమెడియన్స్‌ నిత్యం బిజీగా ఉంటూ రోజులు రెండు, మూడు సినిమాల షఉటింగ్‌లలో పాల్గొంటున్నారు. కమెడియన్స్‌ డేట్స్‌ లేని కారణంగా షఉటింగ్‌లు వాయిదా పడుతున్న సందర్భాలు సైతం ఉన్నాయి. ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న కమెడియన్స్‌ హీరోలుగా రాణించడానికి మాత్రం తంటాలు పడుతున్నారు. పూరర్తిస్థాయి హీరో సినిమాలో కొద్దిసేపు కనిపించి నవ్వించే ఈ నటులను ప్రేక్షకులు హీరోలుగా మాత్రం చూడ్డానికి అంతగా ఇష్టపడడం లేదు.కామెడీ అనేది కొసమెరుపులా వుండాలి కానీ పూర్తిగా ఉంటే మాత్రం వికటిస్తుందనే మాట పరిశ్రమలో వినిపిస్తోంది. కామెడీ చిత్రాల హీరోగా పరిచయమైన అల్లరి నరేష్‌ మధ్యలో ప్రయోగాత్మక పాత్రలు చేసినా, కామెడీకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఇటీవలే యాభై చిత్రాల మైలురాయి దాటాడు. అయితే నరేష్‌ ప్రస్థానం ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. మూస పాత్రలు చేయడం వల్ల కామెడీ వికటిస్తోంది. దీంతో ఆయన కెరీర్‌ ప్రశ్నార్థకమైంది. ఒకసారి కామెడీ ముద్రపడ్డాక ఇతర సీరియస్‌ పాత్రల్లో ప్రేక్షకులు ఆదరించకపోవచ్చు. ఉన్నదాంట్లోనే కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తే బావుంటుందనే అభిప్రాయం ఆయన సన్నిహితులే వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇంట్లో దెయ్యం నాకేం భయం అంటూ మరోసారి నవ్వించడానికి వస్తున్నాడు. ఈ చిత్రం నరేష్‌ కెరీర్‌లో కీలకమైనది. గతంలో నరేష్‌తో సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ వంటి సక్సెస్‌ చిత్రాలు అందించిన జి.నాగేశ్వరరెడ్డి తాజా చిత్రానికి దర్శకుడు.

కమేడియన్స్‌గా సంచలనం సృష్టించిన సునీల్‌ హీరో ప్రస్థానం మాత్రం గందరగోళంగా ఉంది. కామెడీ నుండి హీరోగా మారిన తర్వాత వరుస అపజయాలు చూస్తున్నారు. జక్కన్న, ఈడు గోల్డ్‌ ఎహే చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టడంతో సునీల్‌ సినిమాపై పెట్టుబడి పెట్టడానికి బయ్యర్లు వెనుకాడుతున్నారు. ప్రేక్షకులు సునీల్‌ నుండి సున్నితమైన హాస్యాన్ని కోరుకున్నారు అంతేకానీ హీరోయిజాన్ని కాదని స్పష్టమైంది. అయితే ఒకటి, రెండు సినిమాల ఫలితం నిరాశపరిచినంత మాత్రానా కెరీర్‌ బ్రేకప్‌ అయిందని భావించడానికి అవకాశం లేదు. మళ్లిd మళ్ళీ చేస్తున్న ప్రయత్నాల్లో ఒక్కటి ఫలించినా సరే సునీల్‌ పుంజుకోవడానికి అవకాశాలున్నాయి. తాజాగా మలయాళంలో సక్సెస్‌ అయిన టూ స్టేట్స్‌ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తూ, సునీల్‌ను హీరోగా తీసుకున్నారు. తెలంగాణకు చెందిన శంకర్‌ ఈ చిత్రానికి దర్శకుడు. అలాగే ఉంగరాల లింగరాజు అనే మరో చిత్రంలో కూడా సునీల్‌ నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు హీరోగా ఆయన భవిష్యత్తును తేల్చనున్నాయి.
తాజా సంచలనం సప్తగిరి. తక్కువకాలంలో వెలుగులోకి వచ్చిన సప్తగిరి రోజులు రెండు లక్షలు డిమాండ్‌ చేసే కమేడియన్‌గా ఖ్యాతిగాంచాడు. అతడి వాయిస్‌, సంభాషణలు పలకడం ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. తక్కువకాలంలో అనేక చిత్రాల్లో నటించిన సప్తగిరి హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. సినిమా పేరు సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌. కమర్షియల్‌గా ఈ సినిమాకు మంచి క్రేజ్‌ వచ్చింది. పాటల విడుదల వేడుకకు పవన్‌కల్యాణ్‌ హాజరవుతున్నారని చిత్రబృందం తెలిపింది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ శిష్యుడు అరుణ్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడవుతున్నారు. గత అనుభవాల దృష్టి సప్తగిరి ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందనే చూడాలి. బుల్లితెర యాంకర్‌ నుండి వెండితెరకు కమేడియన్‌గా పరిచయమైన శ్రీనివాసరెడ్డి హీరోగా మరో ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకు ముందు గీతాంజలి సినిమాలో ప్రధాన పాత్రపోషించాడు. హీరోయిన్‌తో డ్యూయట్ల గట్రా లేవుకానీ, గీతాంజలిలో ఆయనే కీలక పాత్రధారి. పైగా ఆ సినిమా విజయం సాధించింది. ఇప్పుడు జయమ్ము నిశ్చయమ్మురా అంటూ ప్రేక్షకుల ముందుకురావడానికి సిద్ధ మవుతున్నాడు. ఈ సినిమాకు సైతం ట్రేడ్‌లో మంచి వ్యాపారం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com