పుణ్యక్షేత్రాల "దివ్య దర్శనం" పేదలకు ఉచితం..

- November 08, 2016 , by Maagulf
పుణ్యక్షేత్రాల

ఇప్పటికే రిజర్వేషన్ల పేరుతో విద్య, వైద్య, ఉద్యోగాల యందు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పలు సదుపాయాలు ఉన్న నేపధ్యంలో. తాజాగా దైవదర్శనాల వద్ద కూడా ఎంపిక చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఓ నూతన సదుపాయాన్ని తీసుకురావడానికి చంద్రబాబు సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే ఆర్థిక స్తోమత లేని వారి కోసం దేవాదాయశాఖ ఓ కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది.
"దివ్య దర్శనం" పేరుతో పేదలను ఉచితంగా పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించని వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. తిరుమల - తిరుపతి, విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం, సింహాచలం, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు లక్ష్మీతిరుపతమ్మ ఆలయం, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంతో పాటు మరికొన్ని క్షేత్రాలకు పేదలను తీసుకెళ్లడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.ఏటా ఒక్కో జిల్లా నుంచి పది వేల మందిని తీర్థయాత్రలకు తీసుకెళ్లాలని, దర్శనం, తీర్థ ప్రసాదాల బాధ్యత కూడా దేవాదాయశాఖే తీసుకోనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి భక్తులను ఎంపిక చేస్తామని, ఒక్కో కుటుంబం నుంచి గరిష్టంగా ఐదుగురిని తీసుకుళ్లే యోచనలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. అలాగే ఒక్కో మండలం నుంచి లాటరీ ద్వారా 200 మందిని "దివ్య దర్శనం" కోసం ఎంపిక చేయనున్నారు. 18 నుంచి 70 ఏళ్ల వయసున్న వారు ఇందుకు అర్హులు. త్వరలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com