భర్తను కోల్పోయిన మహిళకు సాయం చేస్తానని హామీ ఇచ్చిన సుష్మ

- November 10, 2016 , by Maagulf
భర్తను కోల్పోయిన మహిళకు సాయం చేస్తానని హామీ ఇచ్చిన సుష్మ

విదేశాలకు వెళ్లిన ప్రవాస భారతీయులు అక్కడ ఎదుర్కొంటున్న సమస్యలను విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉంటారు. ఫలానా సమస్యతో ఉన్నాం అని ఒక్క ట్వీట్‌ చేస్తే చాలు నేనున్నా అంటూ ఆమె ముందుకొచ్చి సమస్య పరిష్కరించిన ఘటనలు అనేకం. ఇదే తరహాలో భర్తను కోల్పోయిన ఒక మహిళకు, ఆమె బిడ్డకు సాయం చేస్తానని సుష్మ హామీ ఇచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన దీపికా పాండే దంపతులు బోస్టన్‌లో నివసిస్తున్నారు. బోస్టన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న దీపిక భర్తఅక్టోబర్‌ 19న గుండెపోటుతో మృతిచెందాడు. అప్పటికే గర్భవతిగా ఉన్న ఆమెను స్నేహితులు చికిత్స నిమిత్తం న్యూజెర్సీకి తీసుకెళ్లారు.ఈ క్రమంలో ఇటీవలే ఆమె ఒక పాపకి జన్మనిచ్చింది. దీంతో దీపిక కుటుంబసభ్యులు కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ని సాయం చేయమని అభ్యర్థించారు. బోస్టన్‌లో తీసుకున్న హెల్త్‌ ఇన్సూరెన్స్‌ న్యూజెర్సీలో పని చేయదని, అమెరికా పౌరసత్వం కలిగి ఉన్న చిన్నారికి త్వరగా పాస్‌పోర్ట్‌ మంజూరయ్యేలా చూడాలని కోరారు. దీపిక స్వదేశానికి తిరిగొచ్చేయాలని అనుకుంటోందని..అందువల్ల పుట్టిన బిడ్డకు, నాలుగేళ్ల కుమారుడికి భారతదేశ పౌరసత్వం వచ్చేలా చేయమని వారు మంత్రిని అభ్యర్థించారు. దీంతో స్పందించిన మంత్రి 'దీపికా ఈ కష్టకాలంలో మేమంతా మీతో ఉన్నాం. నేను ఇప్పటికే అమెరికాలోని యూఎస్‌ ఎంబసీతో మాట్లాడాను. వారు నీకు కచ్చితంగా సహాయం చేస్తారు' అని ట్వీట్‌ చేశారు.ఇటీవల పాకిస్థాన్‌ యువతికి, భారత్‌ యువకుడికి పెళ్లి జరిగే విషయంలో సుష్మా ఎంతో సాయం చేశారు. గతంలో కూడా చాలా మందికి ఆమె సాయపడిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com