ముంబయి చేరుకున్న ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు రూవెన్‌ రివ్లిన్‌

- November 14, 2016 , by Maagulf
ముంబయి చేరుకున్న ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు రూవెన్‌ రివ్లిన్‌

ఆరు రోజుల భారత్‌ పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు రూవెన్‌ రివ్లిన్‌ సోమవారం ముంబయి చేరుకున్నారు. వ్యాపార, విద్యావేత్తలతో కూడిన పెద్ద ప్రతినిధి బృందంతో ముంబయి విమానాశ్రయంలో దిగిన ఆయన ఇవాళే దిల్లీ వెళ్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌లతో రివ్లిన్‌ భేటీ కానున్నారు. చండీగఢ్‌లో జరగనున్న ఆగ్రో-టెక్‌ కాన్ఫరెన్స్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో కలిసి రివ్లిన్‌ పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా 2008 ముంబయి ఉగ్రదాడుల మృతులకు, సైనిక అమరవీరులకు, మహాత్ముడికి ఆయన నివాళులర్పిస్తారు. .

2008లో ముంబయిలో జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు యూదులు మృతిచెందిన విషయం తెలిసిందే.
వారికి ఆయన నివాళులు అర్పిస్తారు. భారత్‌లో ఉన్న యూదు వర్గానికి చెందిన అధికారులు, నేతలతో రివ్లిన్‌ సమావేశం కానున్నారు. భారత్‌ పర్యటనకు బయల్దేరే ముందు రివ్లిన్‌ మాట్లాడుతూ.. భారత్‌, ఇజ్రాయెల్‌ రెండు దేశాలు కూడా సృజన, స్ఫూర్తికి నిలయాలని, ఇరు దేశాలకు పురాతన సంప్రదాయాలు ఉన్నా, ఆధునిక, సాంకేతికంగా బలోపేతమైన ఆర్థికవ్యవస్థలను అభివృద్ధి చేసుకున్నాయని పేర్కొన్నారు.

భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య దౌత్యసంబంధాలకు 25 సంవత్సరాలు నిండాయని, ఈ నేపథ్యంలో జరుగుతున్న తమ పర్యటన రెండు దేశాలమధ్య స్నేహసంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఆయనతో పాటు వచ్చిన విద్యావేత్తలు భారతీయ విద్యాసంస్థలతో పలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com