ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి మరో ముప్పు...

- December 08, 2016 , by Maagulf
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి మరో ముప్పు...

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి మరో ముప్పు దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళా ఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బుధవారం సాయంత్రం వరకు స్థిరంగా ఉంది. ఆ తర్వాత నుంచి ఉత్తర దిశగా నెమ్మదిగా కదులుతూ బుధవారం రాత్రి వరకు విశాఖపట్నానికి ఆగ్నేయంగా 1,160, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 1,220 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది.ఇది గురువారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. అనంతరం మరో 24 గంటల్లో (శుక్రవారం నాటికి) తుఫానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం బుధవారం రాత్రి వెల్లడించింది. ఇది మచిలీపట్నం-నెల్లూరుల మధ్య డిసెంబర్ 11న తీరం దాటే అవకాశం ఉందని నాసా వాతావరణ విభాగం పేర్కొంది.
కాగా, ఈ తుఫాను పెను ప్రభావం చూపనుందని, గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో బలమైన పెనుగాలులు వీయవచ్చని అంచనా వేస్తోంది.
డిసెంబర్ 11నుంచి దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాలు, ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.కాగా, ఈ తుఫానుకు హిందూ మహాసముద్ర బేసిన్ జాబితాలోని తదుపరి పేరు 'వార్దా'ను ఖరారు చేయనున్నారు. పెను తుఫాను వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్య్సకారులను అధికారులు అప్రమత్తం చేశారు. అంతేగాక, ప్రభావిత ప్రాంతాల అధికారులు, ఉద్యోగుల సెలవులను కూడా రద్దు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com