రేపు అమ‌రావ‌తి స‌చివాల‌యంలో జరగనున్న రెండు కీల‌క స‌మావేశాలు

- December 14, 2016 , by Maagulf
రేపు అమ‌రావ‌తి స‌చివాల‌యంలో జరగనున్న రెండు కీల‌క స‌మావేశాలు

అమ‌రావ‌తి స‌చివాల‌యంలో గురువారం రెండు కీల‌క స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. కేబినెట్ భేటీతో పాటు శాఖాధిప‌తుల స‌మావేశం కూడా సెక్రటేరియట్‌లో జ‌ర‌గ‌నుంది. మూడో త్రైమాసికం ముగుస్తుండ‌టం, శాఖ‌ల వారీగా వృద్ధిరేటు, త్వర‌లో జ‌ర‌గ‌బోయే క‌లెక్టర్ల స‌మావేశంలో చ‌ర్చించాల్సిన అంశాల‌పై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టనున్నారు. పెద్ద నోట్ల ర‌ద్దు.. తాజా ప‌రిస్థితిపైనా మంత్రివర్గం సమీక్షించనుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రివ‌ర్గ స‌మావేశం వెల‌గ‌పూడి స‌చివాల‌యంలో గురువారం మ‌ధ్యాహ్నం రెండున్నర‌ గంట‌ల‌కు జ‌ర‌గ‌నుంది. అంతకుముందు ఉద‌యం 11 గంట‌ల‌కు శాఖాధిప‌తుల స‌మావేశం జ‌ర‌గ‌నుంది. మొత్తం అన్ని శాఖ‌ల ముఖ్య కార్యదర్శులతో పాటు శాఖాధిపతులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే కలెక్టర్ల సమావేశానికి ముందు జరుగుతున్న భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెలాఖరుకు మూడో క్వార్టర్ ముగుస్తుండటంతో ఆర్థిక వృద్ధిపై ప్రధానంగా చర్చించనున్నారు. పెద్ద నోట్ల రద్దు, శాఖల వారిగా ప్రభావంపై చర్చించనున్నారు. ఇప్పటి వరకు బడ్జెట్ నిధుల విడుదల, వ్యయంపైనా సీఎం వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం రెండున్నరకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. నోట్ల రద్దు పైనే చర్చ జరగనుంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితి, ప్రజల ఇబ్బందుల ఫై కాబినెట్ చర్చించనుంది. త్వరలో రానున్న క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు గతంలో మాదిరిగా చంద్రన్న కానుకలు ఇవ్వనుంది ప్రభుత్వం. దీనిపైనా చర్చించనున్నారు. కొత్త ఏడాదిలో కొన్ని కొత్త పథకాలు పెట్టే ఆలోచనలో ఉంది సర్కార్. దీనిపై మంత్రుల అభిప్రాయాలూ తీసుకోనున్నారు సీఎం. అటు జనవరిలో జరిగే జన్మభూమి కార్యక్రమం విజయవంతమవడానికి తీసుకోవాలసిన చర్యలపై సీఎం దిశా నిర్దేశం చేస్తారు. పట్టణాల్లో భవనాల నిర్మాణాలకు ఆన్‌లైన్ విధానం అమలుకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. కొన్ని జిల్లాల్లో పలు సంస్థలకు భూ కేటాయింపులు చేయనుంది మంత్రివర్గం. ఒకే రోజు రెండు కీలక సమావేశాలు ఉండటంతో మొత్తం పాలనా యంత్రాంగం అంతా సచివాలయానికి రానుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com