మంత్రులు, కలెక్టర్లు 'ఆధార్', వేలిముద్రతో చెల్లింపులు..
- December 21, 2016
బుధవారం రాత్రి సమయం 9.30-10గంటలు. విజయవాడలో ఎర్ర బుగ్గలున్న వీఐపీల వాహనాలు పదుల సంఖ్యలో ఒక్కసారిగా హడావుడి చేశాయి. రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు నగదు రహిత లావాదేవీలతో షాపింగ్ చేశారు. డిజిటల్ లావాదేవీలు ఎంత తేలిగ్గా ఉంటాయో ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ కనీసం రెండేసి లావాదేవీలు నిర్వహించాలన్న సీఎం సూచనతో...
మంత్రులు, అధికారులు కదిలారు. విజయవాడలోని బందరు రోడ్డు, పటమట, నక్కల్ రోడ్ తదితర ప్రాంతాల్లో ఇ-పాస్ యంత్రాలు పెట్టిన షాపుల జాబితాను కృష్ణా జిల్లా కలెక్టర్ అందరికీ అందించారు. మంత్రులు పరిటాల సునీత, గంటా శ్రీనివాసరావు బందరు రోడ్డులోని స్వీట్ మ్యాజిక్కు వెళ్లి మిఠాయిలు కొన్నారు. పరిటాల సునీత మిఠాయిలతోపాటు తన భర్త పరిటాల రవికి ఇష్టమైన చెకోడీలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా ఒక కేజీ స్వీట్లు తీసుకున్నారు. తనతోపాటు వచ్చిన అందరికి అరకేజి చొప్పున స్వీట్లు తీసుకొని మొత్తం రూ. 4600 బిల్లు చేశారు. షాపు యజమాని ఆమెకు రూ.500లు డిస్కౌంట్ ఇచ్చారు. ఆధార్ నెంబరు కొట్టగానే పాస్ యంత్రంలో వివిధ బ్యాంకుల పేర్లు వచ్చాయి. ఎస్బీహెచ నుంచి డబ్బు తీసుకోవాలని సునీత చెప్పారు. వేలిముద్ర వేయగానే... నగదు బదిలీ అయిపోయింది. ఎప్పుడో తన భర్తతో కలిసి షాపింగ్లో స్వీట్లు కొనేదానినని, మళ్లీ ఇన్నాళ్లకు తమ నేత ఆదేశానుసారం స్వీట్ షాపుకు వచ్చానని చెప్పారు. మంత్రి గంటా శ్రీనివాసరావు జీడిపప్పుపాకం, కొబ్బరి ఉండలు కొనుగోలు చేశారు. ఆయన క్రెడిట్ కార్డుతో 700 రూపాయల బిల్లు చెల్లించారు. మరో మంత్రి పల్లె రఘునాధరెడ్డి సెల్ఫోన షాపుకు వెళ్లి యాక్సెసెరీస్ కొనుగోలు చేశారు. సీసీఎల్ఏ అనిల్ చంద్ర పునీటా చిన్ని డ్రగ్ హౌస్ అనే చిన్న మందుల దుకాణానికి వెళ్లారు. అక్కడ కొన్ని పౌడర్లు కొనుగోలు చేశారు. ఆధార్ నెంబరు, బ్యాంకు నెంబరు చెప్పారు. దుకాణాదారు వాటిని ఎంటర్ చేశాక... వేలిముద్ర వేయాలని కోరాడు. పునీటా వేలిముద్ర వేయగానే ఆయన బిల్లు మొత్తం రూ.75 దుకాణాదారు ఖాతాలోకి బదిలీ అయిపోయింది. చాలా తేలిగ్గా ఉందని పునీటా వ్యాఖ్యానించారు. మరో మంత్రి కొల్లు రవీంద్ర నక్కల్రోడ్లోని సిద్ధార్థ మెడికల్ షాపులో బిస్కట్లు కొని... 'ఆధార్'తో రూ.200 బిల్లు కట్టేశారు. ఏటీఏం కార్డులతో పనిలేదని, పిన నెంబరు అవసరం లేదని... కేవలం ఆధార్కార్డు నెంబరు, మన బ్యాంకు పేరు చెప్పి వేలి ముద్ర వేయగానే షాపింగ్ పూర్తయిందని రవీంద్ర చెప్పారు.
ఇదే తేలిక: చంద్రబాబు డిజిటల్ లావాదేవీలు అత్యంత సులభతరం అని, ఒకసారి అలావాటుపడితే అంతకంటే తేలిక ఉండదని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ అంశంపై కలెక్టర్ల సదస్సులో ప్రత్యేకంగా మాట్లాడారు. పెద్దనోట్ల రద్దుపై తాను ఏదో మాట్లాడుతున్నానంటూ అంటున్నారని...తాను నోట్ల రద్దుకు తొలినుంచీ మద్దతు ఇచ్చానన్నారు. వెలగపూడి సచివాలయంలోకి తొలి అడుగు పెట్టినప్పుడు మొదటి సంతకం పెద్దనోట్లు రద్దు చేయాలంటూ ప్రధానికి రాసిన లేఖపై సంతకం పెట్టానని గుర్తు చేశారు. అయితే, నోట్లరద్దు ప్రక్రియ అమల్లో కొన్ని లోపాలు తలెత్తాయని, వాటిని సరిచేయాల్సిన క్రమంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. నోట్ద రద్దు అనంతరం తలెత్తిన సమస్యలపై 40రోజులు తలబద్దలు కొట్టుకున్నా పరిష్కారం రాలేదన్నారు. రాష్ట్రంలో 1.75లక్షల దుకాణాలు వ్యాపారాలు నిర్వహిస్తున్నాయని... వాటిలో లక్ష దుకాణాల్లో ఈ-పోస్ యంత్రాలు పెట్టినా సరిపోతుందని చంద్రబాబు అన్నారు. అయితే... ఫించన్లకు నగదు ఇవ్వలేకపోవడం బాధాకరమని తెలిపారు. మరోవైపు ఏ జిల్లాలో ఎన్ని గ్రామాలను నగదు రహితంగా చేశారన్న దానిపై సీఎం చంద్రబాబు అన్ని జిల్లాల కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. విజయనగరం జిల్లాలో ద్వారపూడి, ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం, టంగుటూరు, కందుకూరు గ్రామాలు డిజిటల్ అయ్యాయని కలెక్టర్లు చెప్పారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







