పాక్‌లో బలగాలు.. గత 3 రోజుల్లో దాదాపు 130 మం ది ముష్కరులను ముట్టుబెట్టాయి

- February 19, 2017 , by Maagulf
పాక్‌లో బలగాలు.. గత 3 రోజుల్లో దాదాపు 130 మం ది ముష్కరులను ముట్టుబెట్టాయి

మూడు రోజులుగా సాగుతున్న ముష్కరుల ఏరివేత
ఒక్క రోజే 16 మంది హతం..
350 మంది అనుమానితుల అరెస్టు
పెషావర్‌/ లాహోర్‌, ఫిబ్రవరి 19: సింధ్‌ ప్రావిన్స్‌లో సుప్రసిద్ధ లాల్‌ షాబాజ్‌ దర్గాలో ఐఎస్‌ ఆత్మాహుతి దాడి అనంతరం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్న పాకిస్థాన్‌ బలగాలు.. గత 3 రోజుల్లో దాదాపు 130 మం ది ముష్కరులను ముట్టుబెట్టాయి. హతమైన వారిలో 12 ఉగ్రవాద సంస్థలకు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాదులు, శిక్షకులు, ఆత్మాహుతి దాడి ట్రైనర్లు ఉన్నారు. లాహోర్‌లో ఈ నెలారంభంలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 15 మం ది మృతికి కారణమైన జమాత ఉల్‌ అహ్రార్‌(జేయూఏ) ఉగ్రవాద సంస్థ స్థావరాలను, ఆయుధాగారాన్ని కూడా ధ్వంసం చేశారు.
ఆదివారం ఒక్క రోజే వివిధ ప్రాంతాల్లో 16 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి 350 మందికిపైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి. ఒక్క పంజాబ్‌లోనే 300మందిని నిర్బంధించగా వారిలో అధికులు అఫ్ఘాన్లు, పష్తూన్‌ తెగకు చెందిన వారు ఉన్నారు. దేశ వాయవ్య ప్రాంతంలోని సంక్షుభిత గిరిజన ప్రాంతం కుర్రంలో ఆదివారం 11 మంది అఫ్ఘానిస్థాన్‌ ఉగ్రవాదులను కాల్చివేశాయి. ఇక్కడి సప్పర్‌కోట్‌, పారా చమ్కానీలో కూంబింగ్‌ నిర్వహిస్తుండగా సైనిక బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 11 మంది ఉగ్రవాదులు హతమవ్వగా.. ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రాంతంలో సైనిక దళాల ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోంది. పంజాబ్‌ రాజధాని లాహోర్‌కు 350 కిలోమీటర్ల దూరంలోని లయ్యా జిల్లాలో జేయూఏ ఉగ్రవాద సంస్థకు చెందిన ఐదుగురు ముష్కరులను పాక్‌ బలగాలు కాల్చివేశాయి. ఈ సంస్థకు చెందిన 8 మంది ఉగ్రవాదుల లయ్యా జిల్లాలో తలదాచుకుని మరో దాడికి సంసిద్ధమవుతున్నారనే సమాచారం మేరకు బలగాలు వారి స్థావరాన్ని చుట్టుముట్టి అంతమొందించాయి. ఈ ఘటనలో తప్పించుకున్న ముగ్గురు ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com