ఆధార్‌తో సంబంధం లేకుండానే పెన్షన్ ఖాతా నుంచి పూర్తి సొమ్ము విత్‌డ్రా

- February 28, 2017 , by Maagulf
ఆధార్‌తో సంబంధం లేకుండానే పెన్షన్ ఖాతా నుంచి పూర్తి సొమ్ము విత్‌డ్రా

తాజా ఆదేశాల్లో స్పష్టం చేసిన ఈపీఎఫ్‌వో 
న్యూఢిల్లీ: ఆధార్‌తో సంబంధం లేకుండానే పెన్షన్ ఖాతా నుంచి పూర్తి సొమ్ము విత్‌డ్రా చేసుకునేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) చందాదారులకు అవకాశం కల్పించింది. తాజా ఆదేశాల ప్రకారం పదేళ్ల కంటే తక్కువ సర్వీస్‌ ఉండి ఫుల్‌ అండ్‌ ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న చందాదారు ఫారం 10సీతో పాటు ఆధార్‌ను జతచేయడం తప్పనిసరి కాదని ఈపీఎఫ్‌వో సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.
ఫారం 10డి ద్వారా పెన్షన్ నిర్ధారించుకునే చందాదారు మాత్రం ఆధార్‌ నంబర్‌గానీ ఎన్ రోల్‌మెంట్‌ స్లిప్‌గానీ సమర్పించాల్సి ఉంటుంది.
చందాదారులకు ఈ వెసులు బాటు కల్పించడం వెనుక కారణాన్ని వివరిస్తూ ఫారం 10సీలో ఆధార్‌ నెంబర్‌ తప్పనిసరి చేయడం వల్ల సెటిల్‌మెంట్‌ సమయంలో కొన్ని సమస్యలు తలెత్తాయని అందువల్ల దీన్ని కేవలం ఫారం 10డి ద్వారా పెన్షన్ ఫిక్సింగ్‌కి మాత్రమే పరిమితం చేసినట్లు వెల్లడించారు. చందాదారులతో పాటు పెన్షనర్లకు కూడా ఆధార్‌ తప్పనిసరి చేస్తూ జనవరిలో ఈపీఎఫ్‌వో ఆదేశాలు జారీచేసింది. 
అంతే కాకుండా ఈ సంస్థ తరపున అమలవుతున్న అన్ని సామాజిక భద్రతా పథకాల అమలుకు కూడా ఆధార్‌ తప్పనిసరి చేసింది. ఉద్యోగుల పెన్షన్ స్కీం 1995 ప్రకారం ఉద్యోగుల పెన్షన్ సెటిల్‌మెంట్‌కు చేసుకునే దరఖాస్తులో ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ జనవరి చివర్లో ఆదేశాలు జారీ చేసింది. కాగా చందాదారులతో పాటు పెన్షనర్లకు ఆధార్‌ సమర్పించేందుకు ఇచ్చిన గడువును మార్చి 31 వరకు పొడిగిస్తూ ఈపీఎఫ్‌వో ఫిబ్రవరి మొదట్లో నిర్ణయం తీసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com