దుబాయ్‌లో కేరళ సోదరుడి దీనగాథ

- March 15, 2017 , by Maagulf
దుబాయ్‌లో కేరళ  సోదరుడి దీనగాథ

ఎన్నో కలలతో ఆ యువకుడు దుబాయ్ వెళ్లాడు. జీవితంలో బాగా స్థిరపడాలనుకున్నాడు. కానీ, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది. అని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. కేరళకు చెందిన కె.బీ.అచ్యుతానందన్ ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీలో సేఫ్టీ సూపర్‌వైజర్‌గా పనిచేయడానికి దుబాయ్ వెళ్లాడు. అతడి ఆధ్వర్యంలో సుమారు 1000 మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. వారి రక్షణ బాధ్యతలన్ని అచ్యుతానందన్ వహించాల్సి ఉంటుంది. అయితే జూన్ 2015లో అతడి జీవితంలో అనుకోని సంఘటన జరిగింది. అతడి ఆధ్వర్యంలో పనిచేస్తున్న బంగ్లాదేశీ కార్మికుడు భవనంపైనుంచి కిందపడి చనిపోయాడు. ఆ సమయంలో అతడు ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోకుండా చాలా ఎత్తులో పనిచేసేందుకు భవనంపైకి వెళ్లాడని అచ్యుతానందన్ అంటున్నాడు.
అక్కడ పనిచేయాలని కూడా తాను అతనితో చెప్పలేదన్నాడు. అయితే ప్రమాదకర ప్రదేశాల్లో పనిచేసేవారికి ప్రతి కంపెనీ ఇన్స్యూరెన్స్ కల్పిస్తోంది. అయితే ఈ సంఘటన జరిగడానికి కొద్ది రోజుల ముందే చనిపోయిన కార్మికుడి ఇన్స్యూరెన్స్ గడువు ముగిసింది. దాంతో మృతిచెందిన వ్యక్తికి కంపెనీ ఒక్కరూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదంటూ కంపెనీ ప్రతినిధులు చేతులు దులుపుకున్నారు. కార్మికుల రక్షణ బాధ్యతలు అచ్యుతానందన్‌ వేనంటూ వారు తప్పించుకున్నారు. అయితే ఈ మధ్యనే కేసు కోర్టుకు చేరింది. అచ్యుతానందన్ నిర్లక్ష్యం వల్లనే ఈ దారుణం జరిగిందని  కోర్టు అభిప్రాయపడింది.
ఇన్స్యూరెన్స్ గడువు ముగిసిన వ్యక్తిని పనిలో కొనసాగించడం నేరమని కోర్టు పేర్కొంది. అతడి మృతికి అచ్యుతానందన్ మాత్రమే కారకుడని, మృతుడి కుటుంబానికి అతడు 200000దిర్హమ్స్ (దాదాపు 36 లక్షల రూపాయలు) చెల్లించాలని తీర్పు చెప్పింది. ఇలాంటి బాధ్యరహిత్య పనులు భవిష్యత్తులో చేయకుండా ఉండేందుకు మరో 3000దిర్హమ్స్ కోర్టుకు జరిమానాగా కట్టాలని తీర్పు చెప్పింది. అయితే కంపెనీలో పదినెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఈ పరిస్థితుల్లో తాను అంత డబ్బు ఎలా చెల్లించాలేనంటూ కోర్టుకు మొరపెట్టుకున్నాడు. కానీ, అతడి ఆవేదనను ఎవరు పట్టించుకోలేదు. కంపెనీని సహయం కోరితే 100000 దిర్హమ్స్  చెల్లించేందుకు అంగీకరించింది.
ఇప్పటికే చాలా మంది ఉద్యోగులను కంపెనీ స్వదేశాలకు పంపించిదని అచ్యుతానందన్ అంటున్నాడు. కొత్త ప్రాజెక్టులు కూడా కంపెనీ ఏమి చేపట్టడం లేదని అందువల్ల అందరినీ తిరిగి పంపిస్తున్నరన్నాడు.  తన వీసా గడువు కూడా ముగిసిందని, స్వదేశానికి బయలుదేరాల్సిన సమయం వచ్చిందన్నాడు. కానీ, మిగతా సొమ్ము కట్టకుండా దుబాయ్ అధికారులు భారత్ వెళ్లేందుకు అనుమతించరని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. భారత ప్రభుత్వం చొరవ తీసుకుని తనను ఈ గండం నుంచి తనను గట్టెక్కించాలని కోరుతున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com