కమల్ హాసన్ కు అండగా నడిగర్ సంఘం: సీఎం పళనిసామి సీరియస్

- March 16, 2017 , by Maagulf
కమల్ హాసన్ కు అండగా నడిగర్ సంఘం: సీఎం పళనిసామి సీరియస్

బహుబాష నటుడు కమల్ హాసన్ కు నడిగర్ సంఘం అండగా ఉంటుందని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ అన్నారు. కమల్ హాసన్ కు రాజకీయ పరంగా సమస్యలు తలెత్తితే ఆయనకు అండగా నడిగర్ సంఘం నిలుస్తుందని పేర్కొన్నారు.
తమిళ నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నటుడు, నిర్మాత విశాల్ నిర్మాతల మద్దతు కోరే పనిలో భాగంగా తన బృందంతో కలిసి సేలం చేరుకున్నారు. ఈ సందర్బంగా విశాల్ మీడియాతో మాట్లాడుతూ కమల్ హాసన్ ఇటీవల మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పు లేదని అన్నారు.
తమిళనాడులో ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కమల్ హాసన్ స్పందిస్తూ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలాన్ని రేకెత్తిస్తున్నాయి.
ప్రముఖ తమిళ టీవీ చానల్ తో అగ్నిపరీక్ష పేరుతో కమల్ హాసన్ మాట్టాడిన మాటలు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి ఆగ్రహం కలిగించింది. తమిళనాడులో వెంటనే ఎన్నికలు జరగాలి అంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై ఎడప్పాడి పళనిసామి తీవ్రస్థాయిలో స్పందించారు.
65 ఏళ్ల తరువాత కమల్ హాసన్ కు జ్ఞానోదయం అయ్యిందంటూ ఎడప్పాడి పళనిసామి వ్యంగంగా విమర్శించారు. ఇదిలా ఉంటే కమల్ హాసన్ హిందూ మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని హిందూ మక్కల్ కట్చి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్రన్ చెన్నై నగర పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.
మహాభారతంలోని పాత్ర గురించి మాట్లాడిన కమల్ హాసన్ హిందూవులను కించపరిచారని ఆయన ఆరోపిస్తున్నారు. మొత్తం మీద జయలలిత మరణించిన తరువాత కమల్ హాసన్ చేస్తున్న వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయ నాయకులకు దడపుట్టిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com