వీసా కోసం ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు
- April 02, 2017
ప్రియుడు సౌదీలో.. ప్రేయసి భారత్లో! సామాజిక మాధ్యమాలలో రోజూ మాట్లాడుకుంటున్నా.. పెళ్లి విషయంలో అభిప్రాయభేదాలు రావడంతో ఇరువురూ ఒకరివెనక మరొకరుగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇరు కుటుంబాలకూ కన్నీటిని మిగిల్చిన ఈ ఘటన వివరాలు.. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పోరుమల్ల గ్రామానికి చెందిన కుంట రాజశేఖర్(27), అదే మండలం కట్లకుంట గ్రామానికి చెందిన పొన్నం వెన్నెల పరస్పరం ప్రేమించుకున్నారు. వరుసకు బావామరదల్లు కావడంతో తమ పెళ్లికి ఎవరికీ అభ్యంతరం ఉండదని భావించారు. ఈ క్రమంలో రాజశేఖర్ ఉపాధికోసం సౌదీ వెళ్లాడు.
సామాజిక మాధ్యమాలలో రోజూ మాట్లాడుకునేవారు. సెలవుపై వచ్చి తనను పెళ్లి చేసుకోమంటూ వెన్నెల కోరుతున్నా.. గల్ఫ్లో తను ఎదుర్కొంటున్న కష్టాలను ఏకరువు పెడుతూ, ఇప్పుడు వస్తే మళ్లీ వీసా దొరకదని చెబుతూ రాజశేఖర్ వాయిదా వేసేవాడు. అయితే, ఎడారి దేశంలో ఉన్నవాడికోసం ఎంతకాలం ఎదురుచూస్తావంటూ తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో వెన్నెల ఆందోళన చెందింది. త్వరగా వచ్చి పెళ్లి చేసుకొమ్మని రాజశేఖర్తో గొడవపడింది.
వీసా కావాలో తను కావాలో తేల్చుకోమని చెప్పింది. దీనిపై ఇరువురి మధ్యా వాగ్వివాదం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన వెన్నెల ఈ నెల 25న ఆత్మహత్యకు పాల్పడింది. వెన్నెల మృతికి రాజశేఖరే కారణమని విమర్శిస్తూ ఆమె బావ ఫేస్బుక్లో పోస్ట్లు పెట్టాడు. దీనిపై పలువురు కామెంట్లు పెట్టడంతో రాజశేఖర్ కలత చెందాడు. ప్రేయసి చనిపోయిన బాధకు ఈ విమర్శలు తోడవడంతో తట్టుకోలేక మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, తప్పుడు నిందలతో రాజశేఖర్ మరణానికి కారణమైన వెన్నెల బావపై సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేయాలని రాజశేఖర్ బంధుమిత్రులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







