ఆర్.జి.వి తో సినిమా చేయాలనుందన్నమోహన్‌లాల్‌

- April 18, 2017 , by Maagulf
ఆర్.జి.వి తో సినిమా చేయాలనుందన్నమోహన్‌లాల్‌

ప్రతీ సినిమాకు తనదైన ప్రత్యేకతను చూపించాలని.. వైవిధ్యంగా ఉండాలని తపనపడే నటుడు మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ తాజాగా తన మనసులోని కోరికను బయటపెట్టారు. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నట్లు ఆయన ఇటీవల చెప్పారు. 15 సంవత్సరాల క్రితం ఆర్జీవీ దర్శకత్వంలో రూపొందిన ‘కంపెనీ’లో ఆయన ముఖ్యపాత్ర పోషించారు. దావూద్‌ ఇబ్రహీం జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా 2002లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలవడమే కాదు ఏడు ఫిల్మ్‌ఫేర్‌, మూడు ఐఫా అవార్డులను కొల్లగొట్టింది.
మోహన్‌లాల్‌ మలయాళంలో వరుస విజయాలు సాధిస్తూ దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘పులిమురుగున్‌’-తెలుగులో ‘మన్యం పులి’ ‘ఒప్పం’- తెలుగులో ‘కనుపాప’ మంచి విజయాలు దక్కించుకున్నాయి.మరోవైపు రామ్‌గోపాల్‌ వర్మ వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నారు. ఆయన చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడుతున్నాయి. ప్రస్తుతం అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రధారిగా రూపొందిన ‘సర్కార్‌ 3’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు రామూతో సినిమా చేయాలనుందని మోహన్‌లాల్‌ అభిలాష వ్యక్తం చేయడంతో వీరిద్దరి కాంబినేషన్‌లో కొత్త సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం మోహన్‌లాల్‌ ‘విలన్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత ఆయన ఇప్పటికే ఒప్పుకొన్న పలు ప్రాజెక్టుల్లో బిజీగా అవుతారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాకు మరికొంత కాలం పట్టొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com