ఇజ్రాయెల్‌తో భారీ రక్షణ ఒప్పందాలు

- April 23, 2017 , by Maagulf
ఇజ్రాయెల్‌తో భారీ రక్షణ ఒప్పందాలు

ప్రధాన నరేంద్ర మోదీ వచ్చే నెలలో జరపనున్న ఇజ్రాయెల్‌ పర్యటన సందర్భంగా భారీ స్థాయిలో రక్షణ ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం ఉంది. భారత్‌- ఇజ్రాయెల్‌ల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ పర్యటన జరపనున్నారు. ఆ దేశానికి వెళ్తున్న తొలి భారత ప్రధాని మోదీయే కావడం విశేషం. నౌకా దళం కోసం బరాక్‌-8 ఎయిర్‌ డిఫెన్స్‌ మిసైళ్లు, సైన్యం కోసం స్పైక్‌ యాంటీ ట్యాంక్‌ మిసైళ్ల కొనుగోలు కోసం ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.
‘భారత్‌, ఇజ్రాయెల్‌ల సంబంధాలు ఉచ్ఛస్థితిలో ఉన్నాయి. ఈ పర్యటన చాలా చాలా ముఖ్యమైనది కానుంది. ఎన్నో ఏళ్ల తరువాత ప్రాధాన్యమున్న పర్యటన ఇదే’ అని భారత్‌లో ఆ దేశ రాయబారి డేనియల్‌ కార్మన్‌ అభిప్రాయపడ్డారు. కేవలం ఆయుధాల అమ్మకానికే పరిమితం కాకుండా ఉమ్మడిగా పరిశోధనలు చేయడంపైనా దృష్టి పెడుతున్నట్టు తెలిపారు. గత పిబ్రవరిలో ఇజ్రాయెల్‌తో కలిసి మధ్య తరహా భూమిపై నుంచి ఆకాశంలోకి వెళ్లే క్షిపణులు (మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌...ఎంఆర్‌-శామ్‌) అభివృద్ధి కోసం రూ.17 వేల కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకొంది. రక్షణ రంగమే కాకుండా ఇతర అంశాల్లోనూ పరస్పరం సహకరించుకోవడంపై ఆసక్తి చూపుతున్నట్టు కార్మన్‌ తెలిపారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయని అన్నారు.

తమ సంబంధాల మెరుగుదలపై అరబ్‌ దేశాలేవీ వ్యతిరేకించడం లేదని చెప్పారు. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మారాయని, తాము కూడా కొన్ని అరబ్‌ దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకుంటున్నామని అన్నారు. అరబ్‌ దేశాలతో సత్సంబంధాలు ఉండాలన్న భారత్‌ విధానాలను తాము గౌరవిస్తామని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com