టీఆర్ ఎస్ ప్రభంజనం ఖాయమన్నతెలంగాణ సీఎం కేసీఆర్

- May 27, 2017 , by Maagulf
టీఆర్ ఎస్ ప్రభంజనం ఖాయమన్నతెలంగాణ సీఎం కేసీఆర్

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆరెస్ క్లీన్ స్వీప్. ఇదీ సీఎం కేసీఆర్ నయా సర్వే రిజల్ట్స్. ఆరు ఎంఐఎం, రెండు స్థానాలు మాత్రమే కాంగ్రెస్ గెలుస్తాయంటూ టీఆరెస్‌ఎల్పీ మీటింగ్‌లో చెప్పారు సీఎం కేసీఆర్. ఇదంతా బోగస్ సర్వే అని గోబెల్స్ ప్రచారం కోసమే సర్వేను వాడుకున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.
సీఎం కేసీఆర్ మూడో ప్రోగ్రెస్ రిపోర్ట్‌ తెరపైకి తీసుకొచ్చారు. ఈ దఫా సర్వే.. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కారు వేగం ఎవరికీ అందనంత ఉందని తేల్చేశారు. టిఆర్ఎస్ కు 111, ఎంఐఎంకు 6, మిగిలిన 2 స్థానాలు కాంగ్రెస్‌కు దక్కుతాయని వెల్లడించారు. 2019 ఎన్నికలలోపు అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగినా మెజార్టీ సీట్లు తామే గెలుస్తామని ఆయన నేతలకు భరోసా ఇచ్చారు. 
అటు సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై చేయించిన సర్వే వివరాలను కూడా కేసీఆర్  వివరించారు. తనకు 98 శాతం మార్కులు వచ్చాయన్న కేసీఆర్‌.. మంత్రులు కేటీఆర్‌ 91 శాతం, హరీశ్‌రావు 88 శాతం మార్కులు, తాటికొండ రాజయ్య 86శాతంతో నాలుగో స్థానంలో ఉన్నారని కేసీఆర్ వివరించారు. 
సర్వే రిపోర్ట్‌తో పాటు.. ఎమ్మెల్యేలకు వార్నింగ్ కూడా ఇచ్చారు కేసీఆర్. 50 శాతం మార్కులు సాధించిన వారికి ఢోకా లేదని.. అంతకన్నా తక్కువ వచ్చిన వాళ్లకు మాత్రం టికెట్లు ఇవ్వలేనని తేల్చేశారు. ప్రస్తుతం సర్వే ప్రకారం ఈ లిస్ట్‌లో 35 మంది ఎమ్మెల్యేలున్నారు. పనితీరు మార్చుకోకపోతే.. పక్కన పెట్టేస్తామని చెప్పేశారు. గత సర్వేలో కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యే సంపత్‌, బీజేపీ నుంచి కిషన్‌రెడ్డి పనితీరు బాగుందని ప్రశంసించినప్పటికీ.. ఈ సారి లిస్ట్‌లో మాత్రం వారి పేర్లు లేకుండా పోయాయి. 
ఈ సమావేశంలో కేసీఆర్ కు మరింత భద్రత పెంచాలని కూడా తీర్మానం చేశారు. త్వరలో అన్ని జిల్లాల్లో కేసీఆర్ పర్యటన ఉన్నందున భద్రత పెంచాలని నిర్ణయించారు. రాష్ట్రపతి ఎన్నికలో ఏ అభ్యర్థికి మద్దతివ్వాలన్న అంశంపై పూర్తి నిర్ణయాన్ని కేసీఆర్ కు కట్టబెడుతూ శాసనసభాపక్షం ఏకగ్రీవంగా తీర్మానించింది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ పటిష్ఠతే లక్ష్యంగా సీఎం అత్యవసరంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. 
అయితే.. ఈ సర్వే అంతా మైండ్ గేమ్ అంటున్నాయి విపక్షాలు. ప్రతిపక్షాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడానికి కేసీఆర్‌ ఈ ఎత్తుగడ వేశారని అనుమానిస్తున్నాయి. సర్వే, ర్యాంకులు ఇవన్నీ బోగస్ అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టిపారేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com