బాంగ్లాదేశ్ పై భారత్ పంజా: 240 పరుగుల తేడాతో విజయం

- May 30, 2017 , by Maagulf
బాంగ్లాదేశ్ పై భారత్ పంజా: 240 పరుగుల తేడాతో విజయం

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నిర్వహించిన వార్మప్ మ్యాచ్‌ల్లో భారత్ సత్తా చాటింది. మంగళవారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమండియా 240 పరుగులతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తక్కువ స్కోరుకే ఓపెనర్ రోహిత్ శర్మ పెవిలియన్‌కు చేరినప్పటికీ, దినేశ్‌ కార్తీక్‌ (77 బంతుల్లో 94 రిటైర్డ్‌ అవుట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌), హార్దిక్‌ పాండ్యా (54 బంతుల్లో 80 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), శిఖర్‌ ధావన్‌ (67 బంతుల్లో 60; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించి టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపారు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేదార్‌ జాదవ్‌ (31; 38 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సు), రవీంద్ర జడేజా (32; 36 బంతుల్లో 1 సిక్సు) సైతం రాణించడంతో టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 324 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో రూబెల్‌ హుస్సేన్‌, సంజామల్‌ ఇస్లాం తలో రెండు వికెట్లు తీయగా ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ ఒక వికెట్‌ తీశాడు.
ఈ మ్యాచ్‌లో కోహ్లీ, ధోని, యువరాజ్‌ బ్యాటింగ్‌కు దూరంగా ఉన్నారు. అనంతరం బంగ్లాదేశ్‌ 23.5 ఓవర్లలో 84 పరుగులకే కుప్పకూలింది. మెహదీ హసన్‌ మిరాజ్‌ (24)దే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి 3 ఓవర్లలో బంగ్లాదేశ్ 10 పరుగులు చేసింది. ఆ తర్వాత ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ దెబ్బకు కకావికలమైంది.
ఉమేశ్‌ వేసిన నాలుగో ఓవర్లో సర్కార్‌ (2), షబ్బీర్‌ (0) అవుట్‌ కాగా, తర్వాతి ఓవర్లో భువీ, కైస్‌ (7)ను వెనక్కి పంపాడు. భువనేశ్వర్‌ మరుసటి ఓవర్లోనే షకీబ్‌ (7), మహ్ముదుల్లా (0) పెవిలియన్‌ చేరుకోగా, మొసద్దిక్‌ (0) వికెట్‌ ఉమేశ్‌ ఖాతాలో చేరింది. ఒక దశలో ఆ జట్టు 22 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత మిరాజ్, సున్‌జముల్‌ (18) కొద్దిసేపు వికెట్లు పడకుండా పోరాడారు. ఈ క్రమంలో షమీ, బుమ్రా, పాండ్యా తలా ఒక వికెట్‌ తీశారు. దీంతో 23.5 ఓవర్లలో 84 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లను పేసర్లే కూల్చగా... ఒకే ఓవర్‌ వేసిన స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌కు కూడా ఒక వికెట్‌ దక్కింది.
భారత బౌలర్లు భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేశ్‌యాదవ్‌ తలో మూడు వికెట్లు తీయగా మహ్మద్‌ షమీ, బుమ్రా, హార్దిక్‌ పాండ్యా, అశ్విన్‌ తలో వికెట్‌ తీశారు. ఇదిలా ఉంటే న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్లో కూడా టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com