ఫ్రెంచ్ ఓపెన్: తొలి రౌండ్‌లోనే సానియా మీర్జా జోడీ ఓటమి

- May 31, 2017 , by Maagulf
ఫ్రెంచ్ ఓపెన్: తొలి రౌండ్‌లోనే సానియా మీర్జా జోడీ ఓటమి

ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత టెన్నిస్ అభిమానులు బుధవారం మిశ్రమ ఫలితాలను చవిచూశారు. కొత్త భాగస్వామి కజకస్థానీకి చెందిన యారోస్లావా ష్వెదోవాతో కలిసి తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆడుతోన్న భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది.
ఫ్రెంచ్ ఓపెన్‌లో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన ఈ జోడీ అనూహ్యంగా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. దరియా గావ్రిలోవా (ఆస్ట్రేలియా)-అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా) జోడీతో బుధవారం జరిగిన మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సానియా-ష్వెదోవా జోడీ 6-7 (5/7), 6-1, 2-6 తేడాతో ఓటమి పాలైంది.
సుమారు 2 గంటల 23 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేయడంతోపాటు తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. ఇక పురుషుల డబుల్స్‌లో భారత స్టార్స్‌ లియాండర్‌ పేస్, రోహన్‌ బోపన్న తమ వేర్వేరు భాగస్వాములతో కలిసి శుభారంభం చేశారు.
తొమ్మిదో సీడ్‌గా బరిలోకి దిగిన రోహన్‌ బోపన్న-క్యువాస్‌ (ఉరుగ్వే) జోడీ 6-1, 6-1తో మథియాస్‌ బుర్‌గ్యూ-పాల్‌ హెన్రీ మథియు (ఫ్రాన్స్‌) జోడీపై విజయం సాధించింది. ఇక లియాండర్ పేస్‌-స్కాట్‌ లిప్‌స్కీ (అమెరికా) జంట 7-6 (7/5), 4-6, 6-2తో హైయోన్‌ చుంగ్‌ (దక్షిణ కొరియా)-అల్బోట్‌ (మాల్డోవా) ద్వయంపై గెలిచింది.
మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో సానియా మిర్జా క్రోయేసియాకు చెందిన ఇవాన్ డోడిజ్‌తో కలిసి ఆడనుంది. గతేడాది ఈ జోడీ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com