గల్ఫ్లో నరకం అనుభవిస్తున్న సిద్దవటం మహిళ
- June 12, 2017
జీవనోపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన సిద్దవటం మండలానికి చెందిన పేరూరు సుబ్బలక్షుమ్మ ఏజెంట్ల మోసం కారణంగా అక్కడ నరకయాతన అనుభవిస్తోంది. దుబాయ్లోని ఓ సేఠ్ నివాసంలో వంటమనిషి ఉద్యోగం ఇస్తామని నమ్మబలికిన ఏజెంట్లు ఆమెను సౌదీకి పంపారు. అక్కడ ఎలాంటి జీవనోపాధి చూపకుండా ఓ గదిలో బంధించడంతో సక్రమంగా నీరు, భోజనం అందక ఆమె అగచాట్లు పడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. తన భార్యను కాపాడాలంటూ భర్త పెంచలయ్య సిద్దవటం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి ఆదివారం పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
సిద్దవటం మండలం మాధవరం-1 గ్రామం లక్ష్మీపురానికి చెందిన పేరూరు సుబ్బలక్షుమ్మ, పెంచలయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మూడేళ్ల కిందట పెంచలయ్య రోడ్డు ప్రమాదానికి గురవడంతో పనిచేయలేక ఇంటివద్దే ఉంటున్నారు. కుటుంబ పోషణ కోసం సుబ్బలక్షుమ్మ కూలిపనులకు వెళ్లేవారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన వెంకటేష్ గత జనవరిలో పెంచలయ్య ఇంటి వద్దకెళ్లి సుబ్బలక్షుమ్మను దుబాయ్లో ఒక ఇంట్లో వంటమనిషిగా పంపుతామని, అక్కడ జీతాలు ఎక్కువగా ఉంటాయని నమ్మించారు.
భర్త అంగీకారంతో ఆమెను దుబాయ్ పంపేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రొద్దుటూరు సమీప బొజ్జలవారిపల్లెకు చెందిన గౌస్పీర్, ఎర్రగుంట్లకు చెందిన జిలాని అనే ఏజెంట్లతో వెంకటేష్ ఒప్పందం చేసుకుని పెంచలయ్య నుంచి రూ.80 వేలు తీసుకున్నారు. గత ఫిబ్రవరి 12న ఆమెను విమానం ఎక్కించి పంపారు. అయితే దుబాయ్కు కాకుండా సౌదీకి పంపారు.
అక్కడికి వెళ్లాక ఎలాంటి పనిచూపకుండా కాలయాపన చేసి ఒక గదిలో పెట్టారని భర్త ఫిర్యాదులో పేర్కొన్నారు. గదిలో సక్రమంగా భోజనం, నీరు అందడం లేదని, దుస్తులు మార్చుకునేందుకు కూడా వీల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతోందన్నారు. ఆమె తాను పడుతున్న అవస్థలను సామాజిక మాధ్యమాల్లో వివరించడంతో ఈ విషయంపై దుమారం రేగింది. దీంతో పెంచలయ్య ఏజెంట్లను కలిసి తన భార్యను తిరిగి ఇంటికి రప్పించే ప్రయత్నం చేయాలని వేడుకున్నా వారు స్పందించకపోగా దురుసుగా ప్రవర్తించారని బాధితుడు ఫిర్యాదులో వివరించారు.
ఈమేరకు పెంచలయ్య ఫిర్యాదుతో వెంకటేష్, గౌస్పీర్, జిలానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







