నేడు అధికార లాంఛనాలతో డాక్టర్ సి.నారాయణరెడ్డి అంత్యక్రియలు
- June 13, 2017
నింగికేగిన ధృవతార డాక్టర్ సి.నారాయణరెడ్డి పేరు చిరస్మరణీయంగా నిలిచిపోయేలా, భావితరాలు ఆయన్ను గుర్తుంచుకునేలా స్మారకాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. స్మారక భవనం, కాంస్య విగ్రహాల వంటి కార్యక్రమాలతో ఆయనకు సమున్నత గౌరవం కల్పిస్తోంది. సినారె అంతిమ యాత్ర కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. కడసారి చూపు కోసం తరలివచ్చే అభిమానుల కోసం వంద బస్సులు ఏర్పాటు చేస్తోంది. తెలుగు సాహితీ మకుటంలో కలికితురాయి డాక్టర్ సి.నారాయణరెడ్డి అంత్యక్రియలు అధికార లాంచనాలతో జరగనున్నాయి. రచయితలు, కవుల సందర్శనార్ధం సినారె పార్థివదేహాన్ని తెలంగాణ సారస్వత పరిషత్లో ఉంచుతారు. అనంతరం సారస్వత పరిషత్తు నుంచి అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. విశ్వంభరుడి మహాప్రస్థానం చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ సర్కారు. ప్రభుత్వ లాంఛనాలతో జరిగే అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ స్వయంగా హాజరు కానున్నారు. సినారెకు కడసారి వీడ్కోలు పలికేందుకు రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలు వచ్చే అవకాశం ఉండటంతో.. వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 100 బస్సులు ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. సినారె ఇంటికి వెళ్లి ఆయన పార్ధివదేహానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. సినారె కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. సినారెను భావితరాలు గుర్తుంచుకునేలా ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అటు సింగిరెడ్డి నారాయణరెడ్డి పేరున హైదరాబాద్ లో స్మారక భవనం.. మూడు చోట్ల కాంస్య విగ్రహాలు చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఏదైనా ప్రముఖ సంస్థకు కానీ.. యూనివర్సిటీకి కానీ ఆయన పేరు పెట్టడం ఇలా అనేక ప్రాజెక్టులతో సినారె పేరు శాశ్వతంలా నిలిచేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అటు సినారె పార్థివ దేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. పుప్పాలగూడలోని సినారె నివాసానికి వెళ్లిన చంద్రబాబు.. ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. సినారె కన్నుమూతతో తెలుగుజాతి ఒక మహావ్యక్తిని కోల్పోయిందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణరెడ్డి మృతి తెలుగు భాషకు, సంస్కృతికి, సాహిత్యానికి తీరని లోటన్నారు. మరోవైపు సినారె విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో అరుదైన కార్యక్రమం చేపట్టబోతోంది. నారాయణరెడ్డికి ప్రాణప్రదమైన సారస్వత పరిషత్తుకు పూర్తిస్థాయి అండదండలు అందిస్తామంటూ ప్రకటించి సినారెకు అసలైన నివాళి అర్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







