ఉత్తరకొరియా మరో దుస్సాహసానికి ఒడిగట్టింది

- July 28, 2017 , by Maagulf
ఉత్తరకొరియా మరో దుస్సాహసానికి ఒడిగట్టింది

తమ చర్యలతో అగ్రరాజ్యం అమెరికా సహా పొరుగు దేశాలతో కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియా మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. ఇతర దేశాల హెచ్చరికలను పెడచెవిన పెట్టి.. తాజాగా మరో ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. శనివారం ఉదయం ఈ క్షిపణిని ప్రయోగించినట్లు కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. హ్వాసంగ్‌-14 పేరుతో ప్రయోగించిన ఈ ఖండాంతర క్షిపని 3,725 కిలోమీటర్ల ఎత్తులో 998 కిలోమీటర్లు ప్రయాణించి జపాన్‌ జలాల్లో పడింది.
శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దీన్ని ప్రయోగించారు. క్షిపణి ప్రయోగంపై ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ వున్‌ సంతృప్తిని వ్యక్తం చేసినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. ప్రయోగం విజయవంతమైందని కిమ్‌ అన్నారు. క్షిపణిని అభివృద్ధి చేసిన నిపుణులపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ క్షిపణితో అమెరికా మొత్తం తమ గుప్పిట్లో ఉందని తెలిపారు. అమెరికాలోని ప్రముఖ నగరాలైన లాస్‌ ఏంజిల్స్‌, చికాగో లాంటి వాటిని కూడా ఈ క్షిపణితో నాశనం చేసే సామర్థ్యం తమకుందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
కాగా.. ఉ.కొరియా ఇలాంటి ఖండాంతర క్షిపణిని ప్రయోగించడం ఈ నెలలో ఇది రెండోసారి. జులై 4న తొలి ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. అది అమెరికాలోని అలస్కాను చేరే సామర్థ్యం గలదని ఆ సమయంలో ఉ.కొరియా పేర్కొంది. తాజాగా మరోసారి అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల క్షిపణిని పరీక్షించింది.
ఇది ప్రమాదకర చర్య: ట్రంప్‌ 
ఉ.కొరియా క్షిపణి ప్రయోగాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు. పొరుగుదేశాల హెచ్చరికలను పట్టించుకోకుండా ఉ.కొరియా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ క్షిపణి ప్రయోగం ప్రమాదకర చర్య అని ట్రంప్‌ అన్నారు. అమెరికా ప్రజలను, భూభాగాలను రక్షించేందుకు అవసరమైన భద్రతాచర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com