భారత్ లోను ఐఎస్‌ గ్రూపు

- July 30, 2017 , by Maagulf
భారత్ లోను ఐఎస్‌ గ్రూపు

ఇస్లామిక్‌ స్టేట్‌ (ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా)లో చేరిన కేరళ వాసి బెగ్జిన్‌ విన్సెంట్‌ అఫ్గానిస్తాన్‌ డ్రోన్‌ దాడిలో హతమైనట్లు టెలిగ్రామ్‌ యాప్‌లో అతని కుటుంబానికి సమాచారం అందింది. గత ఏడాది ఇరవై మందికి పైగా కేరళ నుంచి అదృశ్యమై ఐఎస్‌లో చేరినవారిలో విన్సెంట్‌ ఒకడు. దేశంలో చాపకింద నీరులా ఐఎస్‌ భావజాల వ్యాప్తితో పాటు సానుభూతిపరుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా కొనకళ్ల సుబ్రహ్మణ్యం అలియాస్‌ ఒమర్‌ అరెస్ట్‌తో తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఉగ్రమూక సానుభూతిపరులున్నట్లు, వారు తమ సిద్ధాంతాల వ్యాప్తికి ఆన్‌లైన్‌లో ప్రయత్నిస్తున్నట్లు బయటపడింది. అయితే భారత్‌లో ముఖ్యంగా జమ్మూ కశ్మీర్‌లో ఐఎస్‌ కదలికలు పెరగడంతో పాటు సానుభూతిపరుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. 
 
కశ్మీర్‌ గ్రూప్‌ ఏర్పాటు
కశ్మీర్‌లో ఐఎస్‌ జాడలే లేవని నిఘా సంస్థలు, అధికార యంత్రాంగం చెబుతున్నా తమ ఉనికిని చాటుకునేందుకు ఈ ఉగ్రసంస్థ సానుభూతిపరులు ‘కశ్మీర్‌ గ్రూపు’ను నెలకొల్పడం కలకలం రేపుతోంది.‘అన్సరుల్‌ ఖలీఫా జమ్మూకశ్మీర్‌’ పేరిట వారు ఐఎస్‌ గ్రూపును స్థాపించారు. ఎన్‌క్రిప్ట్‌ చేసిన టెలిగ్రామ్‌ యాప్‌లోని ఒక ఛానెల్‌ ద్వారా ఐఎస్‌ సైద్ధాంతిక ప్రచారంతో పాటు ఆయుధాల తయారీ విధానం, దాడులకు ప్రణాళికలతో పాటు ఏవిధంగా దాడులు జరపాలన్న దానిపైనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జమ్మూ,కశ్మీర్‌ పోలీసు సిబ్బంది తమ పై అధికారుల ఆదేశాలను బేఖాతరు చేసి ఇస్లామ్,ముస్లింల శత్రువులపై తమ ఆయుధాలను ఎక్కుపెట్టాలంటూ ఇటీవల ఈ ఛానెల్‌ ద్వారా పిలుపునిచ్చింది. క్షేత్రస్థాయిలో సానుభూతిపరులు ఎలా ఉండాలి, ఇస్లామ్‌ వ్యతిరేక శక్తులపై పోరులో ఎలా వ్యవహరించాలో పేర్కొంటూ ఈ నెల 5వ తేదీన సవివరమైన ఆదేశాలను జారీచేసింది. ఫ్రాన్స్‌లోని నైస్, జర్మనీ రాజధాని బెర్లిన్‌లో పెద్ద పెద్ద ట్రక్‌లను ఉపయోగించి చేసిన దాడుల మాదిరిగా దేశంలో ఎలా దాడులు చేయవచ్చో హిందీలో సూచిస్తూ తాజాగా ఆయా అంశాలను పొందుపరిచింది.
యాక్టివ్‌గా కశ్మీర్‌ గ్రూప్‌
ఈ గ్రూపు గత నెల 2నే టెలిగ్రామ్‌యాప్‌ను క్రియేట్‌ చేసినా, దీనిద్వారా వంద మందికి పైగా సభ్యులు ఏకే–47, రాకెట్‌ లాంఛర్లు, ఇతర ఆయుధాలు ఎలా ఉపయోగించాలి, సూసైడ్‌ బాంబర్లు ఉపయోగించే జాకెట్, కారు బాంబుల తయారీ తదితరాలకు సంబంధించిన వివిధ సమాచార మ్యానువల్స్‌ను ఇచ్చిపుచ్చుకున్నారు. వీటితో పాటు 2008 నవంబర్‌లో ముంబయి హోటళ్లలో జరిగిన మారణకాండకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ వంటి వాటిని కూడా పొందుపరిచారు. ఇరాక్, సిరియాలలో ఎదురుదెబ్బల మధ్య ఐఎస్‌ ప్రాబల్యం క్షీణిస్తోందనే ఊహాగానాలు సాగుతున్నాయి.
అయితే వివిధదేశాల్లో క్రియాశీల సానుభూతిపరుల సంఖ్యను పెంచుకునే వ్యూహాన్ని ఈ సంస్థ అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే జమ్మూ కశ్మీర్‌లో బలం పుంజుకునేందుకు ఐఎస్‌ సభ్యులు, సానుభూతిపరులు తమ ప్రయత్నాలను తీవ్రతరం చేయడంలో భాగంగానే ఈ చర్యలకు దిగినట్లు భావిస్తున్నారు. కశ్మీర్‌లో ప్రభావిత యువత ద్వారా ఐఎస్‌ బ్యానర్లు, పోస్టర్ల ప్రదర్శన పెరగడం, ఈ గ్రూపు ఉనికిలోకి రావడం కాకతాళీయం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com