త్వ‌ర‌లో ఫుల్ టైం రాజకీయాల్లోకి పవన్

- July 31, 2017 , by Maagulf
త్వ‌ర‌లో ఫుల్ టైం రాజకీయాల్లోకి పవన్

దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఉన్న కిడ్నీ సమస్యను మీడియా ముందుకు తీసుకొచ్చిందని, తన బాధ్యతగా అక్కడ పర్యటించి బాధితుల ఆవేదనను ప్రపంచానికి తెలియజెప్పానని జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తమ పార్టీ అధికారికంగా నిర్వహించిన తొలి మీడియా సమావేశం ఇదేనన్నారు. అక్టోబ‌ర్ మాసం త‌ర్వాత నుంచి తాను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌పై దృష్టిసారిస్తాన‌ని ప్ర‌క‌టించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల ఆవేదనను ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియ‌జేయ‌గా.. ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. అలాగే ఈ భేటీలో ఎక్కువ సేపు ఉద్దానం సమస్యపైనే మాట్లాడినట్టు చెప్పారు. పవన్‌ తొలి అధికారిక ప్రెస్‌మీట్‌ విశేషాలు

ఆయన మాటల్లోనే..
రాజకీయ లబ్ధికోసం పనిచేస్తే మేలు జరగదు 
‘మనుషులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే అది దిగజారుడుతనమే అవుతుంది. రాజకీయ లబ్ధికోసం విపక్షాలను విమర్శించుకుంటూ పోతే అసలైన బాధితులకు మేలు జరగదు. ఇలాంటి అంశాలపై మానవతా కోణంలోనే ఆలోచించి ముందుకెళ్లాలి. సమాజానికి మేలు చేసే రాజకీయాలు కావాలి. మనుషుల్ని ఏకం చేసే రాజకీయాలు కావాలి. మనుషుల్ని ఒకరీతిన ఉంచే రాజకీయ విధానం రావాలి. ఉద్దానం సమస్యపై నేను ఎంచుకున్న మార్గమిదే. ఇప్పటికే ఉద్దానం కిడ్నీ సమస్యపై కొంత పరిశోధన జరిగింది. సీఎం కూడా నిధులు కేటాయించారు.

కిడ్నీ సమస్య అంతమే లక్ష్యం 
ఇప్పటికే ఉన్న కిడ్నీ సమస్యకు తోడు అక్కడి పిల్లల్లో ఎదుగుదల లేదు. హార్వర్డ్‌లో దీనిపై నేను మాట్లాడినప్పుడు అక్కడి వైద్యబృందం పరిశోధన చేసేందుకు ముందుకొచ్చింది. అక్కడ కిడ్నీ రీసెర్చి సెంటర్‌ ఏర్పాటు చేయాలి. అనాథలవుతున్న చిన్నారుల్ని ప్రభుత్వం దత్తత తీసుకుంటే బాగుంటుంది. ఈ రెండు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్తే.. ఆయన సానుకూలంగా స్పందించారు. రీసెర్చి సెంటర్‌ ఏర్పాటుచేసి మూడు, నాలుగేళ్లపాటు పరిశోధన కొనసాగిస్తామన్నారు. ఉద్దానంలో కిడ్నీ సమస్యను పూర్తిగా రూపుమాపడమే జనసేన లక్ష్యం.

పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి.. 
ఇప్పటివరకు నేను అప్పుడప్పుడే రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. అక్టోబర్‌ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పూర్తిస్థాయిలో అన్ని సమస్యలపైనా పోరాటం చేస్తాను. మా పార్టీ నిర్మాణానికి సంబంధించి సదస్సులు తెలంగాణలో పూర్త‌య్యాయి. ఏపీలో రెండు మూడు జిల్లాల్లో ఇంకా చేయాల్సి ఉంది. అక్టోబర్‌ మాసం నుంచి అధికశాతం ప్రజా సమస్యలపైనే పనిచేస్తా. ప్రజా సమస్యల్ని తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తా. ప్రస్తుతం నా చేతిలో ఉన్న సినిమా పనులు కూడా అయిపోతున్నాయి. కాగానే.. రెండు నుంచి మూడు వంతుల భాగం రాజకీయాలకే కేటాయించబోతున్నా.

విభజన రాజకీయాలంటే భయం 
నేను గరగపర్రు దళితుల సమస్యపై ఇప్పటివరకు మాట్లాడలేదు. ఎందుకంటే ప్రజల్ని/ సమాజాన్ని విభజించే రాజకీయాలంటే భయం. అలాంటివి బాధ్యతారాహిత్యం అనిపిస్తాయి. గరగపర్రు చాలా సున్నితమైన విషయం. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం వల్లే గరగపర్రు సమస్య పెద్దదైంది. అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్‌లాంటి మహానీయుల్ని ఒక కులానికి, మతానికి , వర్గానికి పరిమితం చేయడం దురదృష్టకరం. నేను ఎక్కడికైనా వెళ్లాలంటే కొంత భయం. నా అభిమానులు వస్తారు. వారితో పాటు సంఘవిద్రోహ శక్తులు చొరబడి నష్టం కల్గించే అవకాశం ఉంటుంది. కొందరు నేతలు జాతి నిర్మాతలపై చేస్తోన్న వ్యాఖ్యలు బాధిస్తున్నాయి. గాంధీజీని వైశ్యుడిగా అభివర్ణించడం కూడా నన్నెంతో బాధించింది. గొప్ప మహనీయులు సేవల్ని భావితరాలకు తెలియజెప్పి వారిని ఉత్తేజపరచాలి తప్ప ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు.

కాకినాడ గోదావరి ఆక్వా పార్కు నిర్మాణంలో యాజ‌మాన్యం నిబంధనల్ని పాటిస్తుందో లేదో చూడాల్సిన అవసరం ఉంది. వారు కాలుష్య నిబంధనల్ని పాటిస్తున్నారా? నిజంగా నిబంధనలు పాటించి ఉంటే ప్రజలకు వివరించి చెప్పాలి. ఆ పార్కు నిర్మాణంలో నిబంధనలు పాటించలేదనేది నా అభిప్రాయం. ఇది వ్యక్తిగతంగా ఎవరో హ్యాండిల్‌ చేసేది కాదు. ప్రజలకు హాని కల్గిస్తుందంటే దాన్ని విరమించుకొనేలా, ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం పనిచేయాలి.

కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై.. 
నాకు కులాలు, మతాలు, ప్రాంతాలతో పనిలేదు. కానీ ప్రస్తుతం నేను రాజకీయాల్లోకి వచ్చాను గనక అలాంటి సమస్యలపైనా మాట్లాడాల్సి వస్తోంది. కాపు రిజర్వేషన్ల అంశం చాలా సున్నితమైనది. ఈ డిమాండ్‌ కొన్ని దశాబ్దాలుగా ఉన్నప్పుడు నిరంతర పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కానీ.. కాంగ్రెస్‌ హయాంలో ఆ పోరాటానికి ఎందుకు బ్రేక్‌ పడిందో ఆలోచించుకోవాలి. రిజర్వేషన్లు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయో ఆలోచించాలి. ప్రజల్ని రెచ్చగొట్టే రాజకీయాలు చేయకూడదు. కష్టనష్టాలు, లోటుపాట్లు ఏవైనా ఉంటే కమిషన్‌కు చెప్పాలి. శాంతియుతంగా పాదయాత్రలు చేసేందుకు ముందుకొస్తే ఎవరికీ భయంలేదు. కానీ, గతంలో హింస చెల‌రేగ‌డం వ‌ల్లే ప్ర‌స్తుతం పాద‌యాత్ర‌ల‌కు అనుమ‌తి నిరాక‌రించార‌నుకుంటున్నా.

పాదయాత్రకు సిద్ధంగానే ఉన్నా.. 
నేను కూడా పాదయాత్ర చేసేందుకు సిద్ధంగానే ఉన్నా. 2014 నుంచే చేద్దామనుకున్నా. పాదయాత్ర చేసేందుకు అనుకూలంగా ఉందో లేదో చూస్తున్నా. నన్ను అభిమానించే వారు సహకరిస్తే పాదయాత్ర చేస్తాను. నన్ను కదలనివ్వరేమోననే భయం ఉంది. మిగతా వాళ్ల పాదయాత్రకు నా పాదయాత్రకు తేడా ఉంది. ఎవరినైనా పలకరించడానికి వెళ్లాలన్నా.. శాంతిభద్రతలు సమస్య వస్తుందనే భయం నాకు ఉంది.

ముందు రాజకీయాలు.. ఆ తర్వాతే సినిమాలు 
రాజకీయాల ద్వారా ప్రజలకు మేలుచేయగలననే నమ్మకం నాకు ఉంది. వారి తరఫున నిలబడగలను. అక్టోబర్‌ తర్వాత ఒకట్రెండు సినిమాలు ఒప్పుకున్నా. కానీ రాజకీయ కార్యక్రమాలు, పార్టీ నిర్మాణంపైనే దృష్టిపెడతా. ముందు రాజకీయాలు.. ఆ తర్వాతే సినిమాలకు నా ప్రాధాన్యం.

నంద్యాల ఉప ఎన్నికపై.. 
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికపై ఎవరికి మద్దతు ఇవ్వాలనేదానిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకట్రెండు రోజుల్లో పార్టీ తరఫున ప్రకటన చేస్తాం. పార్టీ ఫిరాయింపులు నిత్యం జరుగుతున్నాయి. అవకాశవాద రాజకీయాలు ఉన్న కాలం ఇది. దాదాపు అన్ని పార్టీలు అదే అనుస‌రిస్తున్న ప‌రిస్థితి నెల‌కొంది. దీనిపై ఏం మాట్లాడతాం?. ఎవ‌రి బ‌లాలు వారికి ఉంటాయి. జ‌న‌సేన బ‌లం ఎంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లే వ‌ర‌కూ నాకే తెలీదు. పార్టీ నిర్మాణం బాధ్య‌త‌గా జ‌ర‌గాలి. రాగానే నేను అదిచేస్తా.. ఇది చేస్తా.. అని చెప్ప‌డం నా వ‌ల్ల కాదు.’ అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com