మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది అబు దుజానా హతం

- August 01, 2017 , by Maagulf
మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది అబు దుజానా హతం

కశ్మీర్‌లో కల్లోలం సృష్టిస్తున్న ఉగ్రవాదులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామా జిల్లాలోని హక్రిపొరా గ్రామంలో జరిగిన కాల్పుల్లో లష్కరే తోయిబా టాప్‌ కమాండర్‌ అబు దుజానా హతమయ్యాడు. అతనితో పాటు ఆరిఫ్‌ అనే మరో ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. కాశ్మీర్‌ లోయ ప్రాంతంలో కొంతకాలంగా మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదిగా ఉన్న దుజానా... భద్రతా దళాల కన్నుగప్పి తరచూ తన భార్యను కలుస్తున్నాడు. ఈ సారి కూడా అదే ప్లాన్‌ వేయగా.. పోలీసులు పసిగట్టారు. అర్ధరాత్రి తర్వాత అతడు హక్రిపొరాకు వచ్చినట్టు తెలియగానే ఆ ఇంటి చుట్టుముట్టారు. భద్రతా దళాల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు జరపడం ప్రారంభించారు. కొంత సేపు కాల్పులు జరిపిన భద్రతా దళాలు.. ఆ తర్వాత ఇంటిని  పేల్చివేసి అతడిని మట్టుబెట్టారు. జమ్మూకాశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఆపరేషన్‌లన్నింటిలోకి ఇదే అత్యంత విజయవంతమైందని భద్రతా బలగాలు చెబుతున్నాయి. 

పాకిస్థాన్‌ ఆక్రమిక కశ్మీర్‌లోని గిల్గిట్‌-బాల్టిస్తాన్‌ ప్రాంతానికి చెందిన అబు దుజానా దక్షిణ కశ్మీర్‌లో జరిగిన చాలా మిలిటెంట్‌ దాడుల వెనక ప్రధాన సూత్రధారి. అతనిపై 30 లక్షల రూపాయల రివార్డు ఉంది. దుజనాను మట్టుబెట్టిన భారత భద్రతా దళాలకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అతడి పీడ నుంచి విముక్తి  చేసినందుకు భారత ఆర్మీకి అభినందనలు తెలుపుకుంటున్నట్టు జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. భద్రతా బలగాలు ఇదే ఉత్సాహంతో ముందుకెళితేనే రాష్ట్రంలో శాంతి, ప్రశాంతత వెల్లివిరుస్తుందన్నారు. మరోవైపు.. దుజానా ఎన్‌కౌంటర్‌తో రెచ్చిపోయిన అల్లరి మూకలు సైనికులపై రాళ్ల దాడులకు దిగాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com