ఎయిరిండియా విమానానికి అమెరికాలో చేదు అనుభవం

- August 06, 2017 , by Maagulf
ఎయిరిండియా విమానానికి అమెరికాలో చేదు అనుభవం

ఎయిరిండియా విమానానికి అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. విమానంలోని సీటు బెల్టులకు ట్యాగ్‌ నెంబర్లు సక్రమంగా లేని కారణంగా విమానాన్ని టేకాఫ్‌ కానివ్వకుండా నిలిపివేశారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అమెరికాలోని చికాగో నుంచి దిల్లీకి రావల్సిన బోయింగ్‌-777 విమానాన్ని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌ఏఏ) అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విమానంలోని కొన్ని సీట్ల బెల్టులకు ఉండవలసిన టెక్నికల్‌ స్టాండెడ్‌ ఆర్డర్‌(టీఎస్‌వో) నెంబర్లు లేకపోవడాన్ని ఎఫ్‌ఏఏ అధికారులు గుర్తించారు. అది భద్రతా పరమైన సమస్య కానప్పటికీ ఎఫ్‌ఏఏ సిబ్బంది విమానాన్ని టేకాఫ్‌ చేసేందుకు అంగీకరించలేదు. ఈ విమానంలో 342 మంది కూర్చునే సీట్ల సామర్థ్యం ఉంది. 44 మంది ప్రయాణికుల సీట్లు, 12 విమాన సిబ్బంది కూర్చునే సీట్లకు ఈ టీఎస్‌వో ట్యాగ్‌లు లేవని ఎఫ్‌ఏఏ అధికారులు గుర్తించారు.
దాంతో ఎయిరిండియా న్యూయార్క్‌లోని జాన్‌ ఎఫ్‌ కెన్నడీ విమానాశ్రయంలోని పార్కింగ్‌లో ఉన్న బీ-777 విమానం నుంచి కొన్ని సీటు బెల్టులను డెల్టా విమానంలో తెప్పించింది. వాటిని చికాగోలో నిలిపివేసిన విమానంలోని సీట్లకు అమర్చిన తర్వాత విమానం టేకాఫ్‌కు అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ సమస్య కారణంగా విమానం దాదాపు ఎనిమిది గంటలు ఆలస్యమవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. దీనిపై ఎయిరిండియా సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం కొన్ని సీటు బెల్టులకు ట్యాగ్‌లు లేనంత మాత్రాన విమానం టేకాఫ్‌కు అంగీకరించకపోవడం దారుణం అని ఎయిరిండియా ప్రతినిధి మండిపడ్డారు. కొత్త సీటు బెల్టుల కోసం ఆర్డర్‌ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com