జిఎంఆర్‌ గ్రూప్‌ సారథ్యంలోని ఢిల్లీ విమానాశ్రయం విస్తరణ

- August 22, 2017 , by Maagulf
జిఎంఆర్‌ గ్రూప్‌ సారథ్యంలోని ఢిల్లీ విమానాశ్రయం విస్తరణ

మూడు దశల్లో మాస్టర్‌ ప్లాన్‌ అమలు
2021 నాటికి కొత్త రన్‌వే అందుబాటులోకి
జిఎంఆర్‌ గ్రూప్‌ సంస్థ డిఐఎఎల్‌ వెల్లడి
జిఎంఆర్‌ గ్రూప్‌ సారథ్యంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (డిఐఎఎల్‌).. ఢిల్లీ విమానాశ్రయాన్ని విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజిఐఎ) మాస్టర్‌ ప్లాన్‌ 2016 ప్రకారం విమానాశ్రయాన్ని విస్తరిస్తున్నట్లు డిఐఎఎల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ప్రభాకర్‌ రావు చెప్పారు. మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా నిర్వహణలో ఉన్న రెండు ప్రయాణికుల టెర్మినల్స్‌ సామర్థ్యాన్ని పెంచటం, టెర్మినల్‌ 2 కార్యకలాపాలను తిరిగి ప్రారంభించటం, 2021 నాటికి కొత్త రన్‌వేను నిర్మించటం చేయనున్నట్లు ఆయన తెలిపారు. మూడు దశల్లో ఫేజ్‌ 3ఎ (2018-21), 3బి (2021-25), ఫేజ్‌ 4 (2026 నుంచి) ఈ మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగానే టెర్మినల్‌ (టి) 1, టెర్మినల్‌(టి) 3, నాలుగో రన్‌వేను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని చూస్తున్నట్లు రావు చెప్పారు. కాగా అక్టోబరు నుంచి విస్తరణ పనులు చేపట్టనుండటంతో విమానయాన సంస్థల కార్యకలాపాలను టి1 నుంచి పాక్షికంగా టి2 నుంచి చేపట్టాలని సూచించినట్లు ఆయన తెలిపారు.
ఐజిఐఎ మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం టి 1 ప్రయాణికుల సామర్థ్యాన్ని 2 కోట్ల నుంచి 4 కోట్లకు , టి 3 సామర్థ్యాన్ని 3.4 కోట్ల నుంచి 4.5 కోట్లకు పెంచనున్నట్లు చెప్పారు. అలాగే డిపార్చర్‌ టెర్మినల్‌, టి1డి, అరైవింగ్‌ టెర్మినల్‌, టి1సి ని ఒక్కటిగా చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దనున్నామని, ఇందులో భాగంగానే 22 ఏరోబ్రిడ్జిలతో టి1ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రావు వెల్లడించారు. ప్రస్తుతం టి1 ద్వారా కొన్ని విమానయాన సంస్థలు దేశీ సర్వీసులు నిర్వహిస్తున్నాయి. కాగా విమానాశ్రయంలోని ఇతర రన్‌వేలపై ఒత్తిడిని తగ్గించేందుకు 2021 నాటికి నాలుగో రన్‌వేను నిర్మించనున్నట్లు ప్రభాకర్‌ రావు చెప్పారు. రన్‌వే 11/29కి సమాంతరంగా దీన్ని నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. టి1పై సత్వరమే ఒత్తిడి తగ్గించే ఉద్దేశంతో మూడో వంతు కార్యకలాపాలను టి2కి మార్చాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.
2010లో టి2 ను మూసివేయగా ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు 100 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రభాకర్‌ రావు వెల్లడించారు. వచ్చే మూడు నుంచి నాలుగేళ్ల కాలంలోని ప్రయాణికుల రద్దీని టి3, టి2 తీర్చనుండగా ఆ సమయానికి టి1 విస్తరణ ప్రాజెక్ట్‌ పూర్తవుతుందని రావు తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీ విమానాశ్రయం నుంచి 5.77 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగా 8.57 లక్షల టన్నుల కార్గో ఎగుమతి అయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com