బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..

- April 21, 2026 , by Maagulf
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..

త్రివేండ్రం: కేరళ రాష్ట్రం త్రిస్సూర్‌లోని ఓ బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. త్రిస్సూర్ లోని పూరం వేడుక కోసం ముండతికోడ్‌లో నిల్వ ఉంచిన బాణసంచా కేంద్రంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించారు. మరో 40మందికిపైగా గాయపడినట్లు తెలిసింది. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా పేర్కొంది.

ముండతికోడ్‌లో సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనలను రేకెత్తించింది. ఘటన జరిగిన వెంటనే బాణసంచా యూనిట్ మంటలు చెలరేగాయి.. చుట్టు పక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఘటన జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు సహాయక చర్యలు చేపట్టారు. మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా అధికారులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైన కొందరిని మెరుగైన వైద్యం అందించేందుకు మెడికల్ కాలేజీకి తరలించారు.

ఈ ఘటనపై కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, ఘటనా స్థలానికి అదనంగా అంబులెన్సులను తరలించాలని అధికారులకు సూచించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు మెడికల్‌ కాలేజీలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com