ఆధార్ కార్డు సెంటర్లను తెరవండి; లేదా ఫైన్ కట్టాల్సిందే

- September 05, 2017 , by Maagulf
ఆధార్ కార్డు సెంటర్లను తెరవండి; లేదా ఫైన్ కట్టాల్సిందే

ఆధార్‌ కార్డును అన్నింటికీ ఆధారం చేస్తూ వెళ్తున్న కేంద్రప్రభుత్వం, ఆధార్‌ కార్డును తీసుకోని వారికి ప్రత్యేకంగా ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సెంటర్లను కూడా ఏర్పాటుచేస్తోంది. ఈ క్రమంలోనే బ్యాంకులు తమ 10 శాతం బ్రాంచుల వద్ద ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటుచేయడానికి యూఐడీఏఐ మరో నెల పాటు సమయమిచ్చింది. అంటే 100 బ్రాంచులున్న బ్యాంకు 10 బ్రాంచుల వద్ద ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సౌకర్యం కల్పించాలి. సెప్టెంబర్‌ 30 తర్వాత తాము ఆదేశించినట్టు ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సెంటర్లను తెరవకపోతే, ఒక్కో బ్రాంచుకు రూ.20వేల జరిమానా విధించనున్నట్టు యూఐడీఏఐ సీఈవో అజయ్‌ భూషణ్‌ పాండే చెప్పారు.  జూలైలోనే ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సెంటర్లు తెరవాలంటూ ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకులను యూఐడీఏఐ ఆదేశించింది. ప్రతి 10 బ్రాంచుల్లో ఒక దాని దగ్గర ఆగస్టులోపు ఈ సౌకర్యం కల్పించాలని పేర్కొంది. ఈ సమయం ముగియడంతో, మరో నెల పాటు సమయమివ్వాలని చాలా బ్యాంకులు యూఐడీఏఐని కోరాయి.
 
ఈ నేపథ్యంలో మరో నెలపాటు బ్యాంకులకు సమయమిచ్చింది. గడువు ముగిసేలోపల ఈ సౌకర్యం ఏర్పాటుచేయకపోతే, ఒక్కో బ్రాంచుకు ఒక్కో నెలలో రూ.20వేల జరిమానా విధించనున్నట్టు యూఐడీఏఐ హెచ్చరించింది. బ్యాంకు అకౌంట్లు ప్రారంభించడానికి, రూ.50వేలు లేదా ఆపై ఆర్థిక లావాదేవీలు జరుపడానికి ప్రస్తుతం ఆధార్‌ కార్డు తప్పనిసరి. ప్రస్తుత బ్యాంకు అకౌంట్‌ హోల్డర్స్‌ కూడా 2017 డిసెంబర్‌ 31 వరకు తమ ఆధార్‌ నెంబర్‌ను బ్యాంకు అకౌంట్‌తో అనుసంధానం చేసుకోవాలి. ఇలా ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సౌకర్యం బ్రాంచుల వద్ద ఏర్పాటుచేయడంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనాల్సినవసరం ఉండదని పాండే చెప్పారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com