ఉత్తరకొరియాపై యూఎన్ కఠిన ఆంక్షలు

- September 12, 2017 , by Maagulf
ఉత్తరకొరియాపై యూఎన్ కఠిన ఆంక్షలు

యునైటెడ్‌నేషన్స్‌: కయ్యాలమారి ఉత్తరకొరియా ఆగడాలను అడ్డుకునేందుకు ఐక్యరాజ్యసమితి చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధించాలటూ అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానానికి ఐరాస భద్రత మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆ దేశ ఇంధన దిగుమతులపై ఆంక్షలు పెట్టడమేగాక, ఉత్తరకొరియా వస్త్రాల ఎగుమతిపై నిషేధం విధించింది.

'అణ్వాయుధాలు కలిగిన ఉత్తరకొరియాను ప్రపంచం ఎప్పటికీ అంగీకరించదు. ఇప్పటికైనా ఆ దేశ పాలకులు అణు ప్రయోగాలను ఆపకపోతే.. ఆపించాల్సి వస్తుందని భద్రతామండలి స్పష్టం చేసింది' అని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ తెలిపారు. ఇటీవల ఉత్తరకొరియా హైడ్రోజన్‌ బాంబును విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగంపై అమెరికా సహా ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియాపై కఠిన ఆంక్షలు విధించాలని అమెరికా ఐరాసను కోరింది. ఈ మేరకు భద్రతామండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.

దీనిపై సోమవారం ఓటింగ్‌ జరిగింది. అయితే ఉత్తరకొరియా ఇంధన దిగుమతులపై పూర్తిగా నిషేధం విధించాలని అమెరికా కోరినప్పటికీ.. మండలిలోని రష్యా, చైనా మాత్రం దిగుమతులను తగ్గించాలని ఓటు వేశాయి. దీంతో ప్రస్తుతం ఉ.కొరియా దిగుమతి చేసుకుంటున్న ఇంధనంలో 30శాతం వరకూ కోత విధించారు. గ్యాస్‌, డీజిల్‌, హెవీ ఫ్యుయల్‌ ఆయిల్‌ దిగుమతులపై 55శాతం కోత విధించడమేగాక.. సహజ వాయువు, ఆయిల్‌ ఉప ఉత్పత్తులపై నిషేధం విధిస్తూ.. తీర్మానానికి ఆమోద ముద్ర వేసింది. అంతేగాక.. ఉత్తరకొరియా వస్త్రాల ఎగుమతులపై నిషేధం తీసుకొచ్చారు. వస్త్రాల ఎగుమతులు ఉత్తరకొరియా ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకం. ఈ ఎగుమతుల ద్వారా గడిచిన మూడేళ్లలో ఉత్తరకొరియా 760 మిలియన్‌ డాలర్లు ఆర్జించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com