లండన్‌: అనుమానాస్పద స్థితిలో టెక్కీ భార్య స్వాతి మృతి, హత్యేనా?

- October 06, 2017 , by Maagulf
లండన్‌: అనుమానాస్పద స్థితిలో టెక్కీ భార్య స్వాతి మృతి, హత్యేనా?

వరంగల్‌:లండన్‌ నగరంలో హన్మకొండకు చెందిన తిరుమలగిరి స్వాతి (23) అనే మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె భర్త శ్రీపతి రాజేష్‌, అతడి కుటుంబ సభ్యులు హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మృతురాలు స్వాతి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..
హన్మకొండ ఏకశిల పార్క్‌ సమీపంలోని అడ్వకేట్స్‌ కాలనీకి చెందిన తిరుమలగిరి స్వామినాథం, భారతిల ఏకైక కుమార్తె స్వాతిని మచిలీబజార్‌కు చెందిన శ్రీపతి శ్రీనివాస్‌, విజయ దంపతుల కుమారుడు రాజేశ్‌ కు 2016 నవంబర్‌లో ఇచ్చి వివాహం చేశారు. వివాహ సమయంలో రూ. 36 లక్షల కట్నం ఇచ్చినట్టు పేర్కొన్నారు. రాజేశ్‌ పెళ్లికి ముందు సింగపూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేసేవాడు. దీంతో స్వాతిని కట్నకానుకలతో పాటు ఇతర లాంఛనాలు ఇచ్చి ఘనంగా వివాహం చేశారు. పెళ్లి జరిగిన కొద్దిరోజులకు ఇద్దరు కలిసి లండన్‌కు వెళ్లి పోయారు. రాజేష్‌ అక్కడే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తుండగా స్వాతి గృహిణిగానే ఉంటోంది.
ఈ క్రమంలో స్వాతి ఈ నెల 2వ తేదీన లండన్‌లో వారు ఉంటున్న ఇంట్లో నుంచి కనిపించకుండా పోయింది. రెండు రోజుల తర్వాత సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందని, మృతదేహం దొరికిందని రాజేశ్‌ ఈ నెల 4వ తేదీ రాత్రి వరంగల్‌లో ఉంటున్న తల్లిదండ్రులకు, అత్తా, మామలకు ఫోన్‌ చేసి చెప్పాడు. ఈ వార్త విన్న తల్లిదండ్రులు అక్కడ ఉంటున్న వారిని అడిగి తెలుసుకోగా మృతి చెందినట్టు నిర్ధారించారు. కాగా, రాజేశ్‌ తమ కుమార్తెను కట్నం కోసం హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు తిరుమలగిరి స్వామినాథం, భారతిలు ఆరోపిస్తున్నారు. నిశ్చితార్థం అయినప్పటినుంచి ఇంకా కట్నం కావాలని అల్లుడితో పాటు ఆయన కుటుంబ సభ్యులు వేధించేవారని కన్నీరుమున్నీరయ్యారు. స్వాతి మృతితో అడ్వకేట్స్‌ కాలనీలోని నిర్మల అపార్ట్‌మెంట్‌లో విషాదం అలుముకుంది.
రాజేశ్‌ ఇంటిపై దాడికి ప్రయత్నం స్వాతి మృతి చెందినట్టు తెలుసుకున్న బం ధువులు హన్మకొండ మచిలీబజార్‌లో ఉం టున్న రాజేశ్‌ ఇంటికి వచ్చి ఆందోళనకు దిగా రు. స్వాతిని అదనపు కట్నం కోసమే హత్యచేసి ఆత్మహత్యగా కట్టుకథలు అల్లుతున్నారని ఆరోపించారు. ఇంటిముందు ఉన్న తలుపుల జాలీలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న హన్మకొండ ఎస్‌ఐ అశోక్‌కుమార్‌ సిబ్బందితో అక్కడికి వెళ్లడంతో ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు చెప్పారు. స్వాతి మృతిపై అటు సుబేదారి పోలీసులకు గానీ, ఇటు హన్మకొండ పోలీసులకు గానీ ఇంకా ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com