పొగ మా దేశంలోకి వస్తోంది : పాక్

- November 03, 2017 , by Maagulf
పొగ మా దేశంలోకి వస్తోంది : పాక్

భారత్‌పై ఎప్పుడూ విషం కక్కే దాయాది పాకిస్థాన్‌ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్‌, రాజస్థాన్‌లో పంట వ్యర్థాలను తగులబెట్టడటం వల్ల తమ దేశంలో వాయు కాలుష్యం పెరిగిపోయిందంటూ గగ్గోలు పెడుతోంది. దీనికి తోడు థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల ద్వారా వచ్చే పొగ వల్ల కూడా తమ ప్రాంతంలో తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడుతోందని ఆరోపిస్తోంది.

భారత్‌ నుంచి వచ్చే పొగ వల్ల తమ దేశంలోని పంజాబ్‌ రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితి నెలకొందని, చలికాలం కూడా వేసవిని తలపిస్తోందని పాకిస్థాన్‌ దినపత్రిక డాన్‌ కథనం ప్రచురించింది. 'లాహోర్‌ పరిసరాల్లో తీవ్రమైన వాయు కాలుష్యం నెలకొంది. భారత్‌లోని పంజాబ్‌లో పంట వ్యర్థాలను తగులబెట్టడం ద్వారా దట్టమైన పొగ, బూడిద ఇటువైపు వస్తోంది' అని డాన్‌ పత్రిక పేర్కొంది.

'సాహివాల్‌లోని థర్మల్‌ ప్రాజెక్టు వల్లే వాయు కాలుష్యం విపరీతంగా ఉంటోంది. అలాంటిది భారత్‌లోని పంజాబ్‌లో నాలుగు, రాజస్థాన్‌లోని తొమ్మిది థర్మల్‌ ప్రాజెక్టుల నుంచి వెలువడుతున్న పొగ, బూడిద వల్ల మా దేశ సరిహద్దు ప్రాంతాల్లో నాలుగు రోజులుగా తీవ్ర వాయు కాలుష్యం అలుముకుంది' అని పాకిస్థాన్‌ అధికారులు ఆరోపిస్తున్నారు.

'భారత్‌లో పంట వ్యర్థాలను భారీస్థాయిలో తగులబెట్టడం వల్ల దట్టమైన పొగ అలుముకుంటోంది. కోర్టు ఆదేశాలు, మీడియా కథనాలు వాటిని నివారించడంలో విఫలమవుతున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లోని పంజాబ్‌లో 2,620 చోట్ల పంటలను తగులబెట్టినట్లు శాటిలైట్‌ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. పాకిస్థాన్‌ పంజాబ్‌లో మాత్రం కేవలం 27చోట్ల మాత్రమే తగులబెట్టారు. ఈ పొగ బహవాల్‌పూర్‌, ముల్తాన్‌, ఒకారా, పాక్‌పట్టాన్‌, చినియాట్‌, ఫైసలాబాద్‌ తదితర ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది' అని పాక్‌ అధికారులు చెబుతున్నారు. గతేడాది ఇదే కాలంలో అలుముకున్న దట్టమైన పొగ కారణంగా పంజాబ్‌ ప్రజలు కళ్లు మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం తదితర సమస్యలతో బాధపడినట్లు అధికారులు తెలిపారు. ఈ పొగ సమస్యను వర్షాలు మాత్రమే పరిష్కరించగలవని.. కానీ ఈ వారంలో వర్ష సూచనేదీ లేదని వారు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com