గల్ఫ్‌ నుంచి చెల్లింపులు తగ్గుతున్నాయి

- November 06, 2017 , by Maagulf
గల్ఫ్‌ నుంచి చెల్లింపులు తగ్గుతున్నాయి

గల్ఫ్‌ దేశాలు... కోట్లాది భారతీయులకు ఉపాధి బాట... లక్షలాదిమంది భారతీయులు గల్ఫ్‌దేశాలకు వెళ్లి శ్రమించి భారత్‌లోని తమ కుటుంబాలకు డబ్బులు పంపుతుంటారు. ప్రత్యేకించి కేరళ రాష్ట్రంనుంచి లక్షలాదిమంది ఖతర్‌, సౌదీ అరేబియా, కువైట్‌, ఒమన్‌, యూఏఈ, బహ్రెయిన్‌... తదితర దేశాల్లో వివిధ రకాల ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే అనేక కారణాల రీత్యా గల్ఫ్‌కు వెళ్లేవారిసంఖ్య తగ్గుతోంది. చమురు ఉత్పత్తి దేశాలైన గల్ఫ్‌దేశాలకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం, పర్యావరణహితమైన ఇంధన వనరులపై ప్రపంచదేశాలు దృష్టిసారించడం, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న అనిశ్చితి... తదితర అంశాలతో గల్ఫ్‌దేశాల ఆదాయం తగ్గుతోంది. దీంతో ఈ ప్రభావం అక్కడకు వలస వెళ్లిన భారతీయ శ్రామికులపైన ఉండటంతో క్రమేణా గల్ఫ్‌ నుంచి భారత్‌కు వస్తున్న చెల్లింపులు తగ్గుతున్నాయి. 2016లో భారత్‌కు 62.7 బిలియన్‌ డాలర్లు చెల్లింపుల రూపంలో వచ్చాయి. అంతర్జాతీయంగా ఇతరదేశాల్లో ఉపాధి పొందుతున్న వివిధ దేశాలకు చెందిన వారి నుంచి చెల్లింపులు పొందడంలో ప్రథమస్థానంలో ఉంది. 61 బిలియన్‌ డాలర్లతో చైనా రెండో స్థానంలో నిలిచింది.


గల్ఫ్‌ నుంచి వచ్చే చెల్లింపులు భారత్‌కే ఎక్కువ: 
గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చే చెల్లింపుల్లో ఎక్కువగా భారత్‌కే రావడం గమనార్హం. ఈ దేశాల్లో దాదాపు కోటి మంది వరకు భారతీయులు ఉన్నట్టు అంచనా. సౌదీఅరేబియాలోనే 30 లక్షలకు పైగా భారతీయులు వివిధ ఉద్యోగాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 2013-2014తో పోలిస్తే 2015-2016లో మన దేశానికి గల్ఫ్‌లోని భారతీయు ఉద్యోగులు, కార్మికుల నుంచి వచ్చే చెల్లింపులు తగ్గిపోవడం ఆందోళనకరం. కేరళ స్థూల జాతీయోత్పత్తిలో ప్రవాస భారతీయుల నుంచి వచ్చే చెల్లింపులు దాదాపు 36 శాతం ఉన్నట్టు సమాచారం.


ఉత్తరాది రాష్ట్రాల నుంచి... 
గత కొన్ని సంవత్సరాలుగా కేరళ, ఇతర దక్షిణాది రాష్ట్రాల నుంచి గల్ఫ్‌కు వెళ్లేవారి సంఖ్య తగ్గింది. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, పశ్చిమ బంగా... తదితర రాష్ట్రాల నుంచి ఎక్కువమంది గల్ఫ్‌కు ఉపాధి కోసం వెళుతున్నట్టు అధ్యయనంలో వెల్లడయింది. వీరితో పాటు వియత్నాం, బంగ్లాదేశ్‌, నేపాల్‌, ఫిలిప్పైన్స్‌ దేశాల నుంచి గల్ఫ్‌కు వెళ్లేవారి సంఖ్య బాగా పెరిగింది. భారతీయులకు ఇచ్చే వేతనాల కంటే తక్కువగా ఇతర దేశస్థులు ముందుకు రావడంతో యజమానులు వారిపై మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.


ప్రాంతీయ ఉద్రిక్తతలు.. 
గల్ఫ్‌ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు కూడా భారతీయ వలసలకు అడ్డుకట్టువేస్తున్నాయి. ఖతర్‌తో సౌదీ అరేబియాతో పాటు పలుదేశాలు దౌత్యసంబంధాలను తెంచుకోవడం చాలా ప్రభావం చూపింది. యెమెన్‌లో అంతర్యుద్ధం, ఇరాక్‌లో ఘర్షణలు..తదితర అంశాలతో గల్ఫ్‌కు వెళ్లాలనుకున్నప్పటికీ మానుకున్నట్టు అధ్యయనంలో వెల్లడయింది. మరో వైపు సౌదీలో అక్కడి పౌరులకే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో భారతీయులకు అవకాశాలు తగ్గాయి.


దేశంలో పెరుగుతున్న వలసలు.. 
దేశంలోనూ వలసలు పెరుగుతున్నట్టు అధ్యయనంలో తేలింది. కేరళ నుంచి లక్షల మంది ఇప్పటికే గల్ఫ్‌ దేశాల్లో ఉండగా అక్కడ కార్మికశక్తి లభ్యం కావడం లేదు. దీంతో ఒడిశా, పశ్చిమబంగా, ఉత్తర్‌ప్రదేశ్‌... తదితర రాష్ట్రాల నుంచి వేలాదిమంది కేరళకు వచ్చి ఉపాధి పొందుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com