అప్పులిచ్చిన దేశాలకు చుక్కలు చూపిస్తోన్న డ్రాగన్!

- November 10, 2017 , by Maagulf
అప్పులిచ్చిన దేశాలకు చుక్కలు చూపిస్తోన్న డ్రాగన్!

బీజింగ్‌: పొరుగుదేశాలను లోబర్చుకోవడంలో చైనా కిరాతక వ్యూహం అమలుచేస్తోంది. వడ్డీలేని రుణం అని ఊరిస్తూ.. చివరికి ఆయా దేశాలపై తన 'భస్మాసుర హస్తం' పెడుతోంది. మాయమాటలు చెప్పి చివరికి ఆయా దేశాలను తన గుప్పెట్లోకి తెచ్చుకుంటోంది.

మీ దేశాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమంటూ చైనా చెప్పినా అవన్నీ ఉత్తిమాటలే. ఆ మాటలు నమ్మి ఏ దేశమైనా చైనా దగ్గర రుణం తీసుకుందంటే ఇక దాని పని అయిపోయినట్లే!

డ్రాగన్‌ దెబ్బ ఎలా ఉంటుందో మన పొరుగుదేశమైన శ్రీలంకను చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
శ్రీలంకకు ఉన్న మొత్తం అప్పు 65 బిలియన్‌ డాలర్లు. అందులో చైనా నుంచి తీసుకున్న అప్పు 8 బిలియన్‌ డాలర్లు. తొలుత వడ్డీ లేని రుణమని చెప్పిన చైనా తీరా రుణం తీసుకున్న తరువాత మాట మార్చేసింది. ఏ దేశమూ వసూలు చేయని స్థాయిలో భారీగా వడ్డీని వడ్డించింది. దీంతో శ్రీలంక ఉక్కిరిబిక్కిరై గగ్గోలు పెట్టింది. విధిలేని పరిస్థితుల్లో చైనా ఆర్థికసాయంతో అభివృద్ధి చేసిన హంబన్‌టోటా ఓడరేవును చివరికి డ్రాగన్‌కు ధారాదత్తం చేసింది.

పొరుగుదేశాలను.. ముఖ్యంగా భారతదేశంతో సరిహద్దులను కలిగి ఉన్న దేశాలను తన చెప్పుచేతల్లో పెట్టుకోవడం ద్వారా దక్షిణాసియాపై పట్టు బిగించేందుకు చైనా పావులు కదుపుతోంది. అప్పులు, ఆయుధాలు.. ఇవే అస్త్రాలుగా ఆయా దేశాలను తన అదుపాజ్ఞల్లో ఉంచుకొనేందుకు వ్యూహాలు పన్నుతోంది. డ్రాగన్‌ 'రుణ వల'కు చిక్కుకుంటున్న దేశాలు అందులో నుంచి బయటపడే మార్గం లేక చైనా అడుగులకు మడుగులొత్తాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. తొలుత మన దాయాది పాకిస్తాన్‌పై తన వ్యూహాన్ని అమలు చేసిన చైనా అక్కడ గొప్ప విజయమే సాధించింది. పాకిస్తాన్ ను తనకు వలస దేశంగా మార్చేసుకుంది. ఆ ఉత్సాహంతో మిగిలిన పొరుగుదేశాలపైనా అదే వ్యూహాన్ని అమలు చేస్తోంది.

మయన్మార్‌లో భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆ దేశాన్ని చైనా పూర్తిగా తన గుప్పిట బంధించింది. మయన్మార్‌లో 1990 నుంచి మౌలికరంగంలో చైనా భారీ పెట్టుబడులు పెడుతోంది. మయన్మార్‌కు ప్రధాన ఆయుధ సరఫరాదారు చైనానే. బంగ్లాదేశ్‌ విముక్తిలో భారత్‌ కీలక పాత్ర పోషించినా ఆ దేశం భారత్‌తో కన్నా చైనాతోనే ఎక్కువ స్నేహ సంబంధాలు కొనసాగిస్తోంది. అటు బంగ్లాదేశ్‌కు కూడా చైనా ప్రధాన ఆయుధ సరఫరాదారు. 2016లో ఆ దేశానికి చైనా ఆ దేశానికి రెండు జలాంతర్గాములను అందించింది.

బంగ్లాదేశ్ కు 25 బిలియన్‌ డాలర్ల వడ్డీ లేని రుణం అందించింది చైనా. ఇచ్చేటప్పుడు వడ్డీ రహిత రుణం అని చెప్పినా.. తీరా తీసుకున్నాక తప్పనిసరిగా వడ్డీ చెల్లించాలని పట్టుబడుతోంది. తద్వారా బంగ్లాదేశ్‌ను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్నది డ్రాగన్‌ వ్యూహం. మాల్దీవులు విషయంలోనూ చైనా చురుగ్గా పావులు కదుపుతోంది. మాల్దీవుల రాజధాని మాలేకు చెంతనే ఉన్న ఓ దీవిని 4 మిలియన్‌ డాలర్ల చెల్లించి 50 ఏళ్ల లీజుకు చైనా సొంతం చేసుకొంది. మాల్దీవుల్లో చైనా ఎయిర్‌ బేస్‌లను కూడా నిర్మించినట్లు సమాచారం.

డ్రాగన్‌ కౌగిలికి చిక్కని ఏకైక దేశం భూటాన్‌ మాత్రమే. 2007 తర్వాత భూటాన్‌పైనా వల వేసేందుకు చైనా ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే అవేవీ ఫలించలేదు. 2007లో భారత్‌, భూటాన్‌ నడుమ స్నేహపూర్వక ఒప్పందాన్ని కొన్ని మార్పులతో తిరగరాశారు. దీని ప్రకారం భూటాన్‌కి స్వతంత్ర విదేశాంగవిధానాన్ని అనుసరించే వెసులుబాటు లభించింది. దీన్ని ఆసరగా చేసుకొని తమ రెండు దేశాల నడుమ సమస్యలు పరిష్కరించుకుందామని చైనా, భూటాన్‌కు సూచించింది. భారీగా పెట్టుబడులు పెడతానని కూడా ఆ దేశానికి ఆశ చూపింది. అయితే చైనాను విశ్వసించని భూటాన్‌ ఆ దేశంతో దూరాన్నే కొనసాగిస్తోంది.

నేపాల్‌ ఒకప్పుడు భారత్‌తో బలమైన దౌత్య సంబంధాలను కలిగి ఉండేది. సాంస్కృతికంగా రెండు దేశాల నడుమ ఎన్నో సారూప్యతలు ఉన్నాయి. అయితే దశాబ్దకాలంగా నేపాల్‌ క్రమేణా చైనాకు దగ్గర అవుతోంది. ఇంటర్నెట్‌ సేవలు.. మధేసి ప్రజల హక్కుల విషయంలో నేపాల్‌, భారత్‌ నడుమ తలెత్తిన విభేదాలను చైనా తనకు అనుకూలంగా మలచుకుంది. నేపాల్‌కు ఇంటర్నెట్‌ సేవలను అందించడం ద్వారా ఆ దేశానికి దగ్గరైంది. గతంలో ఇంధన అవసరాలకు నేపాల్‌ ప్రధానంగా భారత్‌పైనే ఆధారపడేది.

మధేసీలు హక్కుల కోసం ఉద్యమించినప్పుడు నేపాల్‌ తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో చైనా నేపాల్‌కు ఇంధనాన్ని సరఫరా చేసి, ఆ దేశానికి దగ్గరైంది. చైనా 'వన్‌ బెల్ట్‌.. వన్‌ రోడ్డు' ప్రాజెక్టులోనూ నేపాల్‌ భాగస్వామి అయింది. అదే సమయంలో నేపాల్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకూ చైనా ముందుకొచ్చింది. ఇటీవల ఖాట్మండులో జరిగిన నేపాల్‌ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌-2017లో నేపాల్‌లో 317 మిలియన్‌ డాలర్ల పెట్టుబుడులు పెట్టేందుకు భారత్‌ సిద్ధపడగా, చైనా ఏకంగా 8.3 బిలియన్‌ డాలర్ల పెట్టుబుడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.

మన దాయాది పాకిస్తాన్... చైనాకు మంచి మిత్రదేశం. అయితే.. భారత్‌తో పాకిస్తాన్ తలపడిన ఏ యుద్ధంలోనూ చైనా ఆ దేశానికి సాయంగా వచ్చింది లేదు. 2013 నుంచి ఈ రెండు దేశాల నడుమ బంధం బలోపేతమవుతూ వస్తోంది. 2013లో అంతర్జాతీయ ఒత్తి ళ్లను సైతం కాదని కరాచీలో అణురియాక్టర్‌ నిర్మాణానికి చైనా ముందుకొచ్చింది. మరోవైపు పాక్‌కు 60 బిలి యన్‌ డాలర్ల ఆర్థికసాయాన్నీ ప్రకటించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ మీదుగా నిర్మించనున్న ఎకనమిక్‌ కారిడార్‌ ద్వారా భారత్‌పై పట్టు బిగించాలన్నది చైనా లక్ష్యం. దీనికోసం 46 బిలియన్‌ డాలర్లను చైనా వెచ్చిస్తోంది. పాకిస్తాన్ లోని గ్వదర్‌ పోర్టుతో సీపీఈసీ ముగుస్తుంది. ఈ పోర్టును అభివృద్ధి చేసి 2050 వరకు దాని నిర్వహణ బాధ్యతను కూడా చైనాయే చేపట్టనుంది. ఫలితంగా భారత పశ్చిమ తీర ప్రాంతాన్ని త్వరగా, తేలిగ్గా చేరుకొనే అవకాశం చైనాకు లభిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com