'పద్మావతి'పై సెన్సార్‌ బోర్డు ఆగ్రహం

- November 30, 2017 , by Maagulf
'పద్మావతి'పై సెన్సార్‌ బోర్డు ఆగ్రహం

ముంబయి: దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన 'పద్మావతి' చిత్రంపై చర్చించేందుకు దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ గురువారం పార్లమెంట్‌ ప్యానెల్‌కు హాజరయ్యారు. ఈ ప్యానెల్‌కు సెన్సార్‌ బోర్డు చీఫ్‌ ప్రసూన్‌ జోషి కూడా వెళ్లారు. సమావేశంలో జోషి, ప్యానెల్‌ ఛైర్మన్‌ అనురాగ్‌ ఠాకూర్‌ సినిమా గురించి మాట్లాడుతూ భన్సాలీపై మండిపడ్డారు. సినిమా సెన్సార్‌కు రాకముందే మీడియా వర్గాలకు ఎందుకు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భన్సాలీ సెన్సార్‌ బోర్డును అవమానించారని జోషి ఆరోపించారు. దీనిపై భన్సాలీ స్పందిస్తూ.. తనకు వేరే మార్గం దొరకలేదని సినిమాలో ఎలాంటి తప్పుడు సన్నివేశాలు చూపించలేదని నిరూపించుకోవడానికే స్పెషల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటుచేశానని చెప్పారు. సినిమాపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే తాను చాలా నష్టపోయానని భన్సాలీ ప్యానెల్‌కు వివరించారు. మరోవైపు భన్సాలీ ఇలాంటి ఎమోషనల్‌ ఇష్యూతో సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారని ప్యానెల్‌ ఆరోపించింది. సినిమా ఫిక్షనల్‌ పాత్రల నేపథ్యంలో తెరకెక్కించినప్పుడు అందులో అసలు పేర్లు వాడాల్సిన అవసరమేముందని సెన్సార్‌ బోర్డు భన్సాలీని ప్రశ్నించింది. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని 'పద్మావతి' చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయనున్నది త్వరలో వెల్లడిస్తామని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాపై భాజపా అగ్ర నేత ఎల్‌.కె అడ్వాణీ దర్శకుడు భన్సాలీకి మద్దతు తెలిపారు. సినిమా విషయంలో ఇప్పటికే చాలా మంది కలగజేసుకున్నారని ఇక ప్యానెల్‌ కలగజేసుకోవాల్సిన అవసరంలేదని ఠాకూర్‌కు అడ్వాణీ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com