మేడిపల్లి: తమ కుమారుడు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తానంటే తల్లిదండ్రులు సంతోషించారు. కాయాకష్టం చేసి ఆర్థికంగా ఆసరాగా నిలిచారు. లండన్లో ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఉన్నతంగా ఎదగాలని ఆశించారు. మూడేళ్ల నుంచి కుమారుడి సమాచారం తెలియక కన్నీరు మున్నీరవుతున్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కాచారం గ్రామానికి చెందిన రాపర్తి వెంకటి, భూమక్కల మూడో కుమారుడు రమేశ్ (34) ఏడో తరగతి వరకు ఊళ్లోనే చదువుకున్నాడు. హైదరాబాద్లో డిగ్రీ పూర్తి చేసి ఎంబీఏ చదివేందుకు 2009లో లండన్ వెళ్లాడు. ఏడాది పాటు ఎంబీఏ చదివి 2011 డిసెంబరు వరకు గడువు ముగిసే వీసా పొందిన రమేశ్ 2015 వరకు తమతో ఫోన్లో మాట్లాడినట్లు తండ్రి వెంకటి తెలిపారు. అనంతరం తమతో కనీసం ఫోన్లో మాట్లాడక పోవడంతో ఆవేదన చెందుతున్నట్లు పేర్కొన్నారు. రమేశ్ అన్నయ్య గంగాధర్ ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లగా మరో సోదరుడు గణేష్ ప్రైవేటు ఉపాధ్యాయునిగా కరీంనగర్లో స్థిరపడ్డారు. దుస్తులు కుట్టుకుని జీవించే వెంకటి కుటుంబంలో మరో ఇద్దరు ఆడపిల్లలు ఉండగా వారికి పెళ్లిల్లు చేశారు. తమ కుమారుడు కనిపించడం లేదని పలువురికి విన్నవించామని తల్లిదండ్రులు చెప్పారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయమై స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.