తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ వివాదం
- April 02, 2018
కృష్ణ జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ వివాదం రాజుకుంటుంది. నీటివాడకంపై తెలంగాణ సర్కార్ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం జల చౌర్యానికి పాల్పడుతుందని గడ్కరీకి హరీశ్ రావు లేఖ రాశారు. టాంపర్ ప్రూఫ్ టెలిమెట్రీ వ్యవస్థను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ అధికారులు పోతిరెడ్డిపాడు దగ్గర నీటి విడుదలను పర్యవేక్షించాలని కోరారు.
పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ పరిమితిని మించి నీటిని వాడుకుంటోందని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరికి ఫిర్యాదు చేశారు. కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ సూచనలను ఏపీ నిర్లక్ష్యం చేస్తోందని లేఖ రాశారు. టెలిమెట్రీని అనుసరించడం లేదని, నీటి వాడకంపై ఏపీ ప్రభుత్వం సరైన వివరాలు అందించడం లేదని హరీశ్ లేఖలో చెప్పారు. పోతిరెడ్డిపాడు దగ్గర సీనియర్ అధికారులు నీటి విడుదలను పర్యవేక్షించాలని కోరారు. టాంపర్ ప్రూఫ్ టెలిమెట్రీ వ్యవస్థను వెంటనే ఏర్పాటు చేయాలని హరీశ్ డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం నుంచే ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో పని చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఉపయోగిస్తున్న కృష్ణా నీటిని అంచనా వేయడానికి టెలిమెట్రీ యంత్రాలను ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది. 2016లో మొదటి దశలో 18 యంత్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో 14 తెలంగాణ పరిధిలో 4 యంత్రాలు ఏపీ పరిధిలో ఉన్నాయి. అయితే.. ఏపీలో పోతిరెడ్డిపాడు వద్ద ఏర్పాటు చేసిన యంత్రం పని చేయడం లేదు. మొదట్లో పోతిరెడ్డిపాడుకు 600 మీటర్ల దూరంలో టెలిమెట్రీ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు తెలంగాణ అంగీకరించింది.ఇందుకు భిన్నంగా 12 కిలోమీటర్ల తర్వాత ఏర్పాటు చేశారు. దాంతో ఈ యంత్రం పని సామర్థ్యంపై అనుమానాలు వచ్చాయి.
శ్రీశైలం నుంచి సాగర్కు విడుదల చేసిన నీటిలో సుమారు 45 టీఎంసీలు లెక్కలోకి రాలేదు. ఈ నీటిని సాగర్లోకి విడుదల చేసినట్టు రికార్డుల్లో పేర్కొన్నా.. దానిని పోతిరెడ్డిపాడు నుంచి తరలించారనే అనుమానాన్ని తెలంగాణ వ్యక్తం చేసింది. దీంతో ఈ టెలిమెట్రీ పని విధానం గురించి బోర్డు ముగ్గురు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఆ ప్రాంతాన్ని సందర్శించిన కమిటీ.. వెలాసిటీ సెన్సార్కు అనుకూలంగా రాడార్ లేనందున నీటి ప్రవాహాన్ని కచ్చితంగా అంచనా వేయలేమని తేల్చి చెప్పింది. యంత్రం ఏర్పాటుకు ఈ ప్రాంతం అనుకూలం కాదని టెలిమెట్రీ యంత్రాల సరఫరా సంస్థ సోమర్ కూడా బోర్డుకు ప్రత్యేకంగా లేఖ రాసింది. కమిటి నివేదికపై అధికారులతో చర్చించిన హరీష్ రావు ..ఏపీ జలచౌర్యానికి పాల్పడుతుందని కేంద్రమంత్రికి లేఖలో ఫిర్యాదు చేశారు.
మరోవైపు మొదటి దశ యంత్రాలపై తీవ్ర వివాదం రావడంతో రెండో దశ యంత్రాల ఏర్పాటు ముందుకు కదలడం లేదు. ఇప్పటి వరకు టెండర్లనే ఖరారు చేయలేకపోయారు. దీంతో నీటివాడకంపై తెలుగు రాష్ట్రాల మధ్య ఈ సంవత్సరం వివాదం తప్పకపోవచ్చు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









