షీ-కారిడార్..మహిళలకే ప్రత్యేకం
- April 09, 2018
తిరువనంతపురం: నగరం నడిబొడ్డున మహిళల కోసం ఓ ప్రత్యేక ప్రాంతం.. అందులోకి ప్రవేశించేందుకు వారికే అనుమతి.. సేదతీరేందుకు కుర్చీలు, షీ-టాయిలెట్స్, నాప్కిన్ వెండింగ్ మెషీన్లు, గోడల నిండా స్ఫూర్తివంతమైన మహిళల విజయగాథలు, వారికి రక్షణ కల్పిస్తూ సీసీటీవీలతో నిరంతర నిఘా. ఇలా మహిళలకు అనుకూలమైన సౌకర్యాలతో ఓ ప్రత్యేక ప్రాంతం ఉంటే వారు కాసేపు స్వేచ్ఛగా గడుపగలుగుతారు కదా. కేరళ ప్రభుత్వం దీనిని త్వరలో నిజం చేయబోతున్నది. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఇలాంటి సౌకర్యాలతో ప్రత్యేకంగా షీ-కారిడార్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తిరువనంతపురం కార్పొరేషన్ ఆధ్వర్యంలో వజ్హుతాకౌడ్ ప్రాంతంలోని ప్రభుత్వ మహిళా కళాశాల చౌరస్తా నుంచి కాటన్హిల్ బాలికల ఉన్నత పాఠశాల వరకు షీ-కారిడార్ను ఏర్పాటు చేయనున్నది. తిరువనంతపురాన్ని మహిళల సురక్షిత, నివాస అనుకూల ప్రదేశంగా నిలుపడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని నగర డిప్యూటీ మేయర్ రాఖీ తెలిపారు. ఈ కారిడార్తో మహిళలు బహిరంగ ప్రదేశాల్లోనూ సురక్షితంగా, స్వేచ్ఛగా ఉన్నామనే భావన పొందుతారన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.2 కోట్లు ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. టెండర్లు ఆహ్వానించామని, ఈ ప్రక్రియ పూర్తి కాగానే నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ ఏడాదిలోగా షీ-కారిడార్ను అందుబాటులోకి తెస్తామని చెప్తున్నారు. కారిడార్ డిజైన్ బాధ్యతను ఆర్కిటెక్ట్కు అప్పగించామని, డిజైన్ తుది దశలో ఉన్నదని చెప్పారు.
స్వేచ్ఛగా.. సురక్షితంగా..
ఈ కారిడార్లో రోడ్డుకు ఇరువైపులా మహిళల కోసం ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేస్తారు. వారికి ఇష్టం వచ్చినంత సేపు అక్కడ సేదతీరవచ్చు. కారిడార్ మొత్తం సీసీటీవీ నిఘాలో ఉంటుంది. ఎఫ్ఎం రేడియో, షీ-టాయిలెట్స్, నాప్కిన్ వెండింగ్ మెషీన్లు తదితర సౌకర్యాలుంటాయి. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన, గొప్ప విజయాలు సాధించిన మహిళలకు ఈ కారిడార్ ద్వారా నివాళులు అర్పించనున్నారు. అంతేకాకుండా విజయవంతమైన మహిళల విజయగాథలను ఇక్కడి గోడలపై పెయింటింగ్స్ రూపంలో ప్రదర్శించనున్నారు. వారందరినీ యవతరానికి పరిచయం చేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని రాఖీ పేర్కొన్నారు. తిరువనంతపురంలో మహిళలపై నేరాలు పెరిగిపోతుండటంతో అన్ని వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. రాష్ట్ర పోలీస్ క్రైమ్ బ్యూరో నివేదికల ప్రకారం గత ఏడాది తిరువనంతపురం జిల్లాలో మహిళలపై 1,773 నేరాలు జరిగాయి. ఇందులో 287 లైంగికదాడుల ఘటనలు కాగా, 772 వేధింపుల కేసులు, 40 ఈవ్టీజింగ్ కేసులు, 27 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ షీ-కారిడార్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







