షీ-కారిడార్..మహిళలకే ప్రత్యేకం
- April 09, 2018
తిరువనంతపురం: నగరం నడిబొడ్డున మహిళల కోసం ఓ ప్రత్యేక ప్రాంతం.. అందులోకి ప్రవేశించేందుకు వారికే అనుమతి.. సేదతీరేందుకు కుర్చీలు, షీ-టాయిలెట్స్, నాప్కిన్ వెండింగ్ మెషీన్లు, గోడల నిండా స్ఫూర్తివంతమైన మహిళల విజయగాథలు, వారికి రక్షణ కల్పిస్తూ సీసీటీవీలతో నిరంతర నిఘా. ఇలా మహిళలకు అనుకూలమైన సౌకర్యాలతో ఓ ప్రత్యేక ప్రాంతం ఉంటే వారు కాసేపు స్వేచ్ఛగా గడుపగలుగుతారు కదా. కేరళ ప్రభుత్వం దీనిని త్వరలో నిజం చేయబోతున్నది. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఇలాంటి సౌకర్యాలతో ప్రత్యేకంగా షీ-కారిడార్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తిరువనంతపురం కార్పొరేషన్ ఆధ్వర్యంలో వజ్హుతాకౌడ్ ప్రాంతంలోని ప్రభుత్వ మహిళా కళాశాల చౌరస్తా నుంచి కాటన్హిల్ బాలికల ఉన్నత పాఠశాల వరకు షీ-కారిడార్ను ఏర్పాటు చేయనున్నది. తిరువనంతపురాన్ని మహిళల సురక్షిత, నివాస అనుకూల ప్రదేశంగా నిలుపడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని నగర డిప్యూటీ మేయర్ రాఖీ తెలిపారు. ఈ కారిడార్తో మహిళలు బహిరంగ ప్రదేశాల్లోనూ సురక్షితంగా, స్వేచ్ఛగా ఉన్నామనే భావన పొందుతారన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.2 కోట్లు ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. టెండర్లు ఆహ్వానించామని, ఈ ప్రక్రియ పూర్తి కాగానే నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ ఏడాదిలోగా షీ-కారిడార్ను అందుబాటులోకి తెస్తామని చెప్తున్నారు. కారిడార్ డిజైన్ బాధ్యతను ఆర్కిటెక్ట్కు అప్పగించామని, డిజైన్ తుది దశలో ఉన్నదని చెప్పారు.
స్వేచ్ఛగా.. సురక్షితంగా..
ఈ కారిడార్లో రోడ్డుకు ఇరువైపులా మహిళల కోసం ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేస్తారు. వారికి ఇష్టం వచ్చినంత సేపు అక్కడ సేదతీరవచ్చు. కారిడార్ మొత్తం సీసీటీవీ నిఘాలో ఉంటుంది. ఎఫ్ఎం రేడియో, షీ-టాయిలెట్స్, నాప్కిన్ వెండింగ్ మెషీన్లు తదితర సౌకర్యాలుంటాయి. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన, గొప్ప విజయాలు సాధించిన మహిళలకు ఈ కారిడార్ ద్వారా నివాళులు అర్పించనున్నారు. అంతేకాకుండా విజయవంతమైన మహిళల విజయగాథలను ఇక్కడి గోడలపై పెయింటింగ్స్ రూపంలో ప్రదర్శించనున్నారు. వారందరినీ యవతరానికి పరిచయం చేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని రాఖీ పేర్కొన్నారు. తిరువనంతపురంలో మహిళలపై నేరాలు పెరిగిపోతుండటంతో అన్ని వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. రాష్ట్ర పోలీస్ క్రైమ్ బ్యూరో నివేదికల ప్రకారం గత ఏడాది తిరువనంతపురం జిల్లాలో మహిళలపై 1,773 నేరాలు జరిగాయి. ఇందులో 287 లైంగికదాడుల ఘటనలు కాగా, 772 వేధింపుల కేసులు, 40 ఈవ్టీజింగ్ కేసులు, 27 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ షీ-కారిడార్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







