కేసీఆర్‌తో అఖిలేష్‌ భేటీ.. షెడ్యూల్ ఇదే..

- May 01, 2018 , by Maagulf
కేసీఆర్‌తో అఖిలేష్‌ భేటీ.. షెడ్యూల్ ఇదే..

దేశ రాజకీయాల్లో హైదరాబాద్‌ నుంచే భూ కంపం సృష్టిస్తానన్న సీఎం కేసీఆర్‌ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల నేతలతో వరుస సమావేశాలతో దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కీలక నేతల భేటీకి హైదరాబాద్‌ వేదిక అవుతోంది. యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ కేసీఆర్‌తో భేటీ కానున్నారు.

ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు అఖిలేష్ చేరుకుంటారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అఖిలేష్ కు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ వద్ద అఖిలేష్ యాదవ్ కు అఖిల భారత యాదవ సంఘం, యాదవ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, రాష్ట్ర, జిల్లా నాయకులు ఘన స్వాగతం పలకనున్నారు. మధ్యాహ్నం 12.30గంటలకు ముఖ్యమంత్రి కెసిఆర్‌తో అఖిలేష్‌ భేటీ కానున్నారు. ఇటీవల మంత్రి  కేటీఆర్‌ లక్నో వెళ్ళి అఖిలేష్ తో సమావేశమయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాట్లపై చర్చించారు. కేటీఆర్ ఆహ్వానం మేరకు ఇక్కడకు వస్తున్న అఖిలేష్‌తో ఫెడరల్ ఫ్రంట్ పై చర్చలు జరపనున్నారు సీఎం కేసీఆర్‌.. 

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆలోచన రాగానే మొదట సీఎం కేసీఆర్‌.. మార్చి 19 పశ్చిమ బెంగాల్‌ వెళ్లి సీఎం మమతా బెనర్జీని కలిశారు. మార్చి 28న జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను హైదరాబాద్‌లో కలసి ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చించారు. ఆ తర్వాత ఏప్రిల్‌ 13న కర్ణాటకలో పర్యటించిన కేసీఆర్‌ మాజీ ప్రధాని దేవగౌడతో చర్చలు జరిపారు. ఆయనతో పాటు నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. కర్నాటకలో ఉన్న తెలుగు ప్రజలంతా జేడీఎస్‌కు ఓటేయాలని సీఎం కేసీఆర్‌ పిలుపు కూడా ఇచ్చారు. అక్కడితోనే కేసీఆర్‌ దూకుడు ఆగలేదు. గత నెల 29న చెన్నై వెళ్లి కేసీఆర్‌.. డీఎంకే కురువృద్ధుడు కరుణా నిధి.. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌లతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.. ఇక ఇవాళ యూపీ మాజీ సీఎం అఖిలేష్‌తో భేటీ అవుతున్నారు.

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ప్రాంతీయ పార్టీల కూటమికి కేసీఆర్‌ అందరి నేతలతో ఇలా చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే కీలక నేతలను కలిసిన కేసీఆర్‌.. తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్లుగా అమలు చేస్తున్న  సంకేమ పథకాలు , సాగునీటి ప్రాజెక్టుల  పై వివరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా  రైతులకు ఎకరానికి  8 వేల రూపాయలు రెండు విడుతలుగా పెట్టుబడి పధకం కింద అందివ్వనున్నారు. మే 10న పంపిణి కి శ్రీకారం చుట్టబోతున్న కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూపీ మాజీ సీఎం అఖిలేష్ భేటి ప్రాధాన్యత సంతరించుకుంది..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com